AP Disha Act: ఆ తొమ్మిది కారణాల వల్లే.. నిర్భయ కంటే పకడ్బందీగా: దిశ చట్టంపై హోం మంత్రి సుచరిత.. !
అమరావతి:మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన వారికి 21 రోజుల్లోనే ఉరిశిక్ష విధించడానికి ఉద్దేశించిన ఏపీ దిశ చట్టం చరిత్రలో నిలిచిపోతుందని హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. దేశంలోనే మొదటిసారిగా ఈ తరహా చట్టాన్ని తీసుకొచ్చామని, మిగిలిన రాష్ట్రాలు ఏపీని అనుసరించేలా దిశా నిర్దేశం చేశామని చెప్పారు. దిశ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం మీద పలు మహిళా సంఘాలు ఒత్తిడి తీసుకొస్తున్న నేపథ్యంలో.. ఆమె స్పందించారు.
ఆ తొమ్మిది కారణాల వల్లే..
నిర్భయ చట్టం కంటే పకడ్బందీగా దిశ చట్టాన్ని రూపొందించామని, దాని ఫలితంగానే- అన్ని రాష్ట్రాలు కూడా ఏపీ వైపు చూస్తున్నాయని అన్నారు. నిర్భయ చట్టం ప్రకారం.. దోషులకు యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం కూడా ఉందని, దిశ చట్టంలో ఆ వెసలుబాటును కల్పించలేదనే విషయాన్ని సుచరిత గుర్తు చేశారు. అత్యాచార ఘటనల్లో దోషులకు ఉరిశిక్ష మాత్రమే విధించేలా తాము చట్టానికి రూపకల్పన చేసినట్లు చెప్పుకొచ్చారు.
నిర్భయ చట్టంతో పోల్చుకుంటే..
నిర్భయ చట్టంతో పోల్చుకుంటే.. దిశ చట్టంలో పొందుపరిచిన అంశాలు కఠినంగా ఉన్నాయని వెల్లడించారు. నిర్భయ చట్టం ప్రకారం రెండు నెలల్లో దర్యాప్తు చేయాల్సి ఉంటుందని, మరో రెండు నెలల వ్యవధిలో దోషి లేదా దోషులకు చట్టప్రకారం శిక్ష పడాల్సి పడుతుందని అన్నారు. నిర్భయ చట్టంలో యావజ్జీవ కారాగార శిక్షకు కూడా అవకాశం కల్పించారని చెప్పారు. దిశ చట్టంలో ప్రకారం.. 21 రోజుల్లోనే విచారణ పూర్తవుతుందని వెల్లడించారు. జైలు శిక్ష పడటానికి అవకాశమే లేదని, ఏకంగా ఉరి శిక్షే విధిస్తారని పేర్కొన్నారు.
చిన్నపిల్లలపై అత్యాచారం జరిగితే.. రెండు వారాల్లోనే విచారణ
చిన్నపిల్లలు, మైనర్లపై అత్యాచారానికి పాల్పడిన దోషులను శిక్షించడానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పోక్సో చట్టాన్ని అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ చట్టం కింద దోషులకు మూడేళ్ల నుంచి ఏడు సంవత్సరాల వరకూ శిక్ష విధిస్తారు. దిశ చట్టం కింద పిల్లలపై ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడినా.. యావజ్జీవ కారాగార శిక్ష లేదా మరణశిక్ష తప్పనిసరి అవుతుంది. పిల్లలపై లైంగిక దాడులకు సంబంధించి పోక్సోలో పొందుపరిచిన విధంగా సంవత్సర కాలం పాటు విచారణ నిర్వహిస్తారు. దిశ చట్టంలో దీన్ని ఏడు రోజుల్లోనే ముగించాల్సి ఉంటుంది.
ప్రతి జిల్లాలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు..
దిశ చట్టం ప్రకారం. ప్రతి జిల్లాలో ఓ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ను ఏర్పాటు చేస్తామని సుచరిత వెల్లడించారు. మహిళలపై అత్యాచారాలు, యాసిడ్ దాడులు, సోషల్ మీడియాలో వేధింపులు, పిల్లలపై ఆకృత్యాలకు పాల్పడటం వంటి కేసులను మాత్రమే విచారిస్తుందని అన్నారు. ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తవుతుందని వెల్లడించారు.