లైంగిక వేధింపులు: టిడిపి గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శిపై నిర్భయ కేసు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి, గాంధీనగర్ డివిజన్ జవహర్ నగర్కు చెందిన అమరం వినోద్పై చిక్కడపల్లి పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు.ఈ మేరకు వివరాలను ఇన్స్పెక్టర్ ఎన్ఎల్ఎన్ రాజు తెలిపారు.
ఆయన కథనం ప్రకారం.. నగరంలోని దోమలగూడ రిలయన్స్ అపార్ట్ మెంట్లో ఉంటున్న గాయకురాలైన ఓ వివాహిత మహిళతో వినోద్కు ఫైనాన్స్ విషయంలో కొంతకాలం కిందట పరిచయం ఏర్పడింది.
అప్పటి నుంచి వారిద్దరూ సన్నిహితంగా ఉంటున్నారు. అయితే ఇటీవల విభేదాలు రావడంతో మాట్లాడుకోవడంలేదు. ఈ నేపథ్యంలో ఆమెను లైంగికంగా వేధించడం, చంపుతానని బెదిరిస్తున్నాడని సదరు మహిళ రెండు రోజుల కిందట వినోద్పై ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. దీంతో అతనిపై నిర్భయ కేసు నమోదు చేశామన్నారు.
అనుమానాస్పదస్థితిలో యువకుడి మృతి
నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం రెంజర్ల గ్రామంలో అనుమానాస్పదస్థితిలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన అక్షయ్(19) ఇంటర్మీడియట్ మధ్యలో నిలిపి వేసి ఇంట్లోనే ఉంటున్నాడు.
కాగా, సోమవారం ఇంట్లో ఉరి వేసుకొని కనిపించాడు. దీంతో తల్లి సుజాత పోలీసులకు సమాచారం అందించింది. ఉరికి గల కారణాలు తెలియలేదు. మృతుడి తండ్రి మర్రెన్న 15 ఏళ్ల క్రితమే హత్యకు గురయ్యాడు. దీంతో తల్లి సుజాత అక్షయ్ని అల్లారుముద్దుగా పెంచింది. కన్న కొడుకు, కట్టుకున్న భర్త ఇద్దరూ చనిపోవడంతో సుజాత కన్నీరుమున్నీరైంది.
కాగా, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.