ఎపి నుంచే సీతారామన్: గవర్నర్ కోటాలో నాయని
న్యూఢిల్లీ/ హైదరాబాద్: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఎక్కడి నుంచి రాజ్యసభకు ఎంపికవుతారనే ఊహాగానాలకు తెర పడింది. ఆమె ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేట్ కానున్నారు. రాజ్యసభ సభ్యురాలు గానీ లోకసభ సభ్యురాలు గానీ కానటువంటి నిర్మలా సీతారామన్ను ప్రధాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు.
నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మృతితో ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. ఆ స్థానం నుంచి నిర్మలా సీతారామన్ను రాజ్యసభకు పంపించాలని పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయించినట్లు బిజెపి ప్రధాన కార్యదర్సి అనంతకుమార్ చెప్పారు.
నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ జూన్ 23 కాగా, జులై 3వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. వాణిజ్య శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ మోడీ మంత్రివర్గంలో పనిచేస్తున్నారు. కాగా, నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ కోడలు కావడం విశేషం.
ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయని నర్సింహారెడ్డిని శాసన మండలికి ఎంపిక చేశారు. గవర్నర్ కోటా కింద ఆయనను శాసనమండలికి ఎంపిక చేశారు. ఎమ్మెల్సీ గానీ ఎమ్మెల్యే గానీ కానవటువంటి నాయని నర్సింహారెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మంత్రివర్గంలోకి తీసుకున్నారు. నాయనితో పాటు రాములు నాయక్ను కూడా గవర్నర్ కోటా కింద శాసన మండలికి ఎంపిక చేశారు.