అంధ్ర కోడలిగా బాధ్యత: నిర్మలా సీతారామన్ (ఫొటోలు)
విశాఖపట్నం: తమిళనాడులో పుట్టినప్పటికీ ఆంధ్రప్రదేశ్ కోడలిగా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను నిబద్ధతతో నెరవేరుస్తానని ఆమె చెప్పారు. పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని, రెవెన్యూ, మౌలిక సదుపాయాలు లేకుండా దిక్కుతోచని స్థితిలో ఉందన్నారు. ఈ క్లిష్ట సమయంలో ఆంధ్రప్రదేశ్ కోడలిగా తన గురుతర బాధ్యత నిర్వర్తించే పనిలో పడ్డానని ఆమె చెప్పారు.
రాష్ట్ర విభజన వల్ల అన్నివిధాలుగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉత్తరాఖండ్ వంటి హిల్ స్టేట్స్కు ఇచ్చినట్టు ప్రత్యేక ప్రతిపత్తి, రాయితీలు ఇచ్చే అంశాన్ని కేంద్ర అధ్యయన బృందం నిశితంగా పరిశీలిస్తోందని ఆమె వెల్లడించారు. ప్రత్యేక ప్రతిపత్తి ద్వారా పారిశ్రామికాభివృద్ధికి గల అనుకూల అంశాలను చర్చించడానికి ఈ నెల 25న ఏపీ నుంచి ఎన్నికైన బిజెపి, టిడిపి పార్లమెంటు సభ్యులతో ఒక సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు.
ఏపీ కోటాలో రాజ్యసభకు ఎంపికై మంత్రి పదవి చేపట్టిన తర్వాత తొలిసారిగా శుక్రవారం విశాఖ వచ్చిన నిర్మలా సీతారామన్కు స్థానిక రైల్వే న్యూ కాలనీలోని సుబ్బలక్ష్మీ కల్యాణ మండపంలో ఘనంగా సన్మానం చేశారు. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాల నుంచి భారీ సంఖ్యలో హాజరైన బిజెపి శ్రేణులనుద్దేశించి ఆమె మాట్లాడారు.
విశాఖపట్నం-చెన్నై నగరాల మధ్య పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించిందని త్వరలో పనులు ప్రారంభమవుతాయని ఆమె వెల్లడించారు. కాకినాడలో హార్డ్వేర్ హబ్, చిత్తూరులో హార్టికల్చరల్ హబ్ ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేశామన్నారు. కాకినాడ, రాజమండ్రి పరిసర ప్రాంతాలలో ఆహార ఉత్పత్తులు పుష్కలంగా ఉన్నందున కేంద్ర ఆహార వనరుల శాఖ మంత్రి హరితా కౌర్ను ఏపీని సందర్శించాల్సిందిగా ఆహ్వానించానని చెప్పారు.
ఆంధ్ర కోడలికి సన్మానం
ఆంధ్ర కోడలు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు శుక్రవారం విశాఖపట్నంలో ఘన సన్మానం జరిగింది. ఈమెకు ఇలా కిరీటం తొడిగారు.
కోడలిగా బాధ్యత నెరవేరుస్తా...
ఆంధ్రప్రదేశ్ కోడలిగా తాను బాధ్యత నిర్వహిస్తానని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని నిర్మలా సీతారామన్ అన్నారు.
బుందేల్ఖండ్ తరహా..
ఎపికి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీని త్వరితగతిన అమలు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు.
ఎంపీలతో సమావేశం..
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్యాకేజీ గురించి చర్చించడానికి ఈ నెల 25వ తేదీన టిడిపి, బిజెపి పార్లమెంటు సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు.