మోడీ ఫోటోలేదని సభనుండి వెళ్లిపోయిన కేంద్రమంత్రి
ఏలూరు: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అలక వహించారు! ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటం లేదని ఆమె కినుక వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిర్మలా సీతారామన్, స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుల మధ్య ఈ మనస్పర్థ చోటు చేసుకుంది.
రూ.30 కోట్లతో నిర్మించిన ఆర్వోబీని ప్రారంభించేందుకు నిర్మలా సీతారామన్ పాలకొల్లుకు వచ్చారు. తొలుత తన కార్యాలయంలో తేనీటీ విందుకు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆమెను ఆహ్వానించారు.
అక్కడ టీడీపీ శ్రేణులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆమెను మాట్లాడాలని కోరారు. అయితే, వేదిక వద్ద ప్రధాని నరేంద్ర మోడీచిత్ర పటం లేకపోవడంతో ఆమె ఒకింత అసహనానికి లోనయ్యారు. అంతేకాదు, ఆమె అక్కడి నుండి వెళ్లిపోయారు.
రాజధానికి మరో నాలుగువేల ఎకరాలు!
రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో మరో నాలుగు వేల ఎకరాల సేకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల్లో ఇప్పటికే రైతుల నుంచి 33 వేల ఎకరాలను భూ సమీకరణ చట్టం ద్వారా సేకరించింది.
రాజధాని ప్రాంతంలో రైతులకు సంబంధించిన పట్టా భూములు 33,800 ఎకరాలు ఉన్నట్లు అధికారుల వద్ద గణాంకాలున్నాయి. ఇంకా 800 ఎకరాలను రైతుల వద్ద నుంచి సమీకరించాల్సి ఉంది. ప్రభుత్వం రాజధాని నిర్మాణాలకు 37 వేల ఎకరాలు అవసరమవుతుందని సింగపూర్ పర్యటన అనంతరం మంత్రి నారాయణ ప్రకటించారు.