గాంధీ జయంతి రోజు నుంచే నిరుద్యోగ భృతి అమలు: చంద్రబాబు, ఎంతంటే?
అమరావతి: నిరుద్యోగులకు అందించే నిరుద్యోగ భృతిని అక్టోబర్ 2 నుంచి పంపిణీ చేయనున్నట్లు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ పథకాన్ని ప్రారంభించనున్నామని చెప్పారు.
ఉండవల్లిలో నిర్వహించిన టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. 'ముఖ్యమంత్రి యువనేస్తం' పేరుతో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ పథకానికి అర్హులైన నిరుద్యోగులకు నెలకు రూ. వెయ్యి చొప్పున భృతిని అందిస్తామని చెప్పారు.
ఇది ఇలా ఉండగా, గుంటూరు జిల్లా మంగళగిరిలోని సీకే కన్వెషన్ హాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు తాను ఆసియా క్రీడల్లో సాధించిన రజత పతాకాన్ని సీఎం చంద్రబాబుకు చూపించారు. ఈ సందర్భంగా సింధుపై చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు. పీవీ సింధు కఠోర శ్రమతో చిన్న వయస్సులోనే ఎంతో పేరు ప్రఖ్యాతలు సాధించారని, ఒక్కో ఇంటి నుంచి ఒక్కో సింధు వచ్చేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి ముఖ్యమంత్రి పురస్కారాలు ప్రదానం చేశారు.
కాగా, బ్యాడ్మింటన్లో మరిన్ని పతకాలు సాధించి ఆంధ్రప్రదేశ్, దేశానికి మరింత పేరు తీసుకొస్తానని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి వీపీ సింధు అన్నారు. ఒలింపిక్స్ పతకం సాధించినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందించిన ప్రశంసలు మరిచిపోలేనివని.. ఆయన అందించిన సహకారంతోనే ఆటలో మెరుగ్గా ఆడుతున్నానన్నారు. తల్లిదండ్రులే తనకు తొలి గురువులని.. చదువుతో పాటు బ్యాడ్మింటన్లోనూ తాను ఈ స్థాయికి చేరుకోవడం వెనుక గురువుల పాత్ర ఎంతో ఉందన్నారు. వారందరికి ధన్యవాదాలు తెలిపారు.