కొడుకు మృతి: నారాయణ కోర్టుకు వెళ్తారా? స్పీడ్పై బెంజ్ ప్రతినిధుల ఆశ్చర్యం
తన తనయుడు నిషిత్ నారాయణ మృతిపై మెర్సిడిస్ బెంజ్ సంస్థను కోర్టుకు లాగాలని ఏఫీ మంత్రి నారాయణ నిర్ణయించుకున్నారని ప్రచారం జరుగుతోంది. నిషిత్ ప్రయాణిస్తున్న కారు హైదరాబాద్ లో ఓ మెట్రో పిల్లర్ ను బలంగా ఢీ
న్యూఢిల్లీ: తన తనయుడు నిషిత్ నారాయణ మృతిపై మెర్సిడిస్ బెంజ్ సంస్థను కోర్టుకు లాగాలని ఏఫీ మంత్రి నారాయణ నిర్ణయించుకున్నారని ప్రచారం జరుగుతోంది. నిషిత్ ప్రయాణిస్తున్న కారు హైదరాబాద్ లో ఓ మెట్రో పిల్లర్ ను బలంగా ఢీ కొని, మృతి చందిన విషయం తెలిసిందే.
ఈ ప్రమాదంలో నిషిత్ నారాయణతో పాటు అతని స్నేహితుడు మృతి చెందారు. ఈ ప్రమాద ఘటన అత్యంత ఘోరమైనది కావడం, కారు నామరూపాలు లేకుండా దెబ్బతినడంతో, జర్మనీ నుంచి బెంజ్ కంపెనీ ప్రతినిధులు వచ్చి ప్రమాద స్థలిని, కారును పరిశీలించారు.
నారాయణ కొడుకు మృతి: అత్యంత సేఫ్టీ కలిగిన కారు ఎందుకు కాపాడలేదంటే?
కాగా, అమిత వేగంతో ప్రయాణించినప్పటికీ, కారులోనూ సాంకేతిక లోపాలున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎంత ప్రమాదం జరిగినా, లోపలున్న వారికి ప్రాణహాని కలుగకుండా ఏర్పాట్లు ఉన్న కారులోని కొన్ని లోపాలు కూడా నిషిత్ మరణానికి కారణమని అంటున్నారు.
బెంజ్ను నారాయణ కోర్టుకు లాగుతారా?.. సేఫ్టీ మెజర్స్ ఉన్నప్పటికీ..
దీంతో ఈ విషయమై కోర్టుకు వెళ్లాలని మంత్రి నారాయణ భావిస్తున్నారని తెలుస్తోంది. నివేదికను పరిశీలించిన అనంతరం.. న్యాయ నిపుణులతో చర్చించి ఈ విషయంలో ఓ నిర్ణయానికి వస్తారని అంటున్నారు.
అయితే, కారు సేఫ్టీ విషయంలో స్పీడ్ కూడా ఓ అంశమని తేలిన విషయం తెలిసిందే. భారతీయ రోడ్లు ఆ కారు స్పీడ్కు ఏమాత్రం సరిపోవని భావిస్తున్నారు. అదే సమయంలో కారు 200 కిలోమీటర్లకు పైగా దూసుకెళ్తే సేఫ్టీ మెజర్స్ ఉపయోగపడవని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో నారాయణ కోర్టుకు వెళ్తారనే ఊహాగానాలు నిజమా లేదా చూడాలి.
పరిశీలన
ఇదిలా ఉండగా, నిషిత్ కారు ప్రమాదం నేపథ్యంలో వాస్తవాలను పరిశీలించేందుకు జర్మనీ నుంచి వచ్చిన మెర్సిడెస్ బెంజ్ ప్రతినిధులు గురువారం జూబ్లీహిల్స్లోని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. జపాన్, హాంకాంగ్, ఢిల్లీ, పుణెకు చెందిన బెంజ్ కార్ల నిపుణులు, ఓ లీగల్ అడ్వైజర్తో కూడిన పదిమంది సభ్యుల బృందం ప్రమాద స్థలికి చేరుకుని వివరాలు సేకరించింది.
స్పీడ్పై ఆశ్చర్యం
ఈ సందర్భంగా ప్రమాద తీవ్రతకు కారు నుజ్జు నుజ్జు అయిన విషయం తెలిసి ఆశ్చర్యపోయారు. ప్రమాద సమయంలో కారు 210 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న విషయం తెలిసి నోరెళ్ల బెట్టారని తెలుస్తోంది. ఈ రోడ్లపై ఇంత స్పీడా అని ఆశ్చర్యపోయారని తెలుస్తోంది.
ట్రాఫిక్ ఉండదని..
ట్రాఫిక్లో అంతవేగం ఎలా సాధ్యపడిందని ఆరా తీశారని సమాచారం. అయితే ప్రమాదం జరిగింది తెల్లవారుజామున కావడంతో ట్రాఫిక్ ఉండదని పోలీసులు వారికి తెలిపారు. మెట్రో పిల్లర్ నిర్మాణం, మూలమలుపు, వర్షం కురిసిన సమయంలో రోడ్డు పరిస్థితి తదితర వివరాలను మెట్రో అధికారుల నుంచి సేకరించారు.
80-120 మధ్య ఉండే బతికేవారని..
అనంతరం బోయిన్పల్లిలోని బెంజ్ షోరూంకు వెళ్లి అక్కడి మెకానిక్లతో మాట్లాడారు. నిషిత్ కారు వేగం గంటకు 80-120 కిలోమీటర్ల మధ్య ఉన్నట్టయితే ఆయన బతికి బయటపడే అవకాశం ఉండేదని ఈ సందర్భంగా నిపుణులు అభిప్రాయపడ్డారు. కారులోని సెక్యూరిటీ సిస్టం, ఎయిర్బ్యాగ్స్, సీటు బెల్టులు సరిగానే పనిచేస్తున్నాయని, మితిమీరిన వేగం వల్లే నిషిత్ ప్రాణాలు కోల్పోయినట్టు ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది.