కెబిఆర్ కాల్పుల్లో క్లూలు: దొరికిన నిందితుడి ఆనవాళ్లు
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కాసు బ్రహ్మానంద రెడ్డి (కెబిఆర్) పార్కు వద్ద అరిబిందో ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి) నిత్యానంద రెడ్డిపై జరిగిన కాల్పుల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసుల నిందితుడికి సంబంధించిన క్లూలు లభించాయి. హైదరాబాదులోని మెహిదీపట్నంలోని ఓ ప్రముఖ వస్త్ర దుకాణంలో నిందితుడు లుంగీ, చొక్కా కొన్నట్లు పోలీసులు గుర్తించారు. సూపర్ మార్కెట్లో అతను కొన్న సరుకులకు సంబంధించిన బిల్లు ఆధారంగా పోలీసులు క్లూలు సాధించారు.
నిత్యానంద రెడ్డిపై ఎకె - 47 గురి పెట్టిన నిందితుడు ఆయన తమ్ముడు పట్టుకోవడానికి ప్రయత్నించడంతో పారిపోయాడు. ఆ సమయంలో కాల్పులు జరిపాడు. ఎకె - 47 రైఫిల్ను వదిలేసిపోయాడు. సంఘటనా స్థలంలో అతని బ్యాగ్ కూడా దొరికింది. బ్యాగులో ఉన్న దుకాణం బిల్లు ఆధారంగా పోలీసులు దర్యాప్తు సాగించారు. వస్త్రదుకాణంలోని సిసి కెమెరాల దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించారు. నిత్యానంద రెడ్డి కూడా సిసి కెమెరా దృశ్యాలను చూసి నిందితుడిని గుర్తించారు.
నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు ఆరు బృందాలను ఏర్పాటు చేశారు. కాగా, నిందితుడు వాడిన ఎకె - 47 రైఫిల్ నిరుడు డిసెంబర్లో గ్రేహౌండ్స్ నుంచి అదృశ్యమైందిగా గుర్తించారు. ఈ ఘటనపై ఈ ఏడాది ఫిబ్రవరిలో కేసు నమోదైంది. 15 మంది పోలీసులను అప్పట్లో సస్పెండ్ చేశారు. వారిలో ముగ్గురిని పోలీసులు విచారిస్తున్నారు. వారికి కూడా నిందితుడిని గుర్తించడానికి సిసి కెమెరాలోని దృశ్యాలను చూపించినట్లు సమాచారం. కిడ్నాప్ చేసి, డబ్బులు గుంజడానికి నిందితుడు ప్రయత్నించాడని అంటున్నారు.
తనకు శత్రువులు ఎవరూ లేరని నిత్యానంద రెడ్డి చెప్పారు. అయితే, వ్యాపార లావాదేవీలు గానీ కుటుంబ కలహాలు గానీ ఈ ఘటనకు కారణమై ఉంటుందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిత్యానంద రెడ్డిని ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పరామర్సించారు. ఆయన నిత్యానంద రెడ్డి నివాసానికి వెళ్లి పరామర్శించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కూడా నిత్యానంద రెడ్డిని పరామర్శించారు.
బుధవారం ఉదయం కేబీఆర్ పార్కులో వాకింగ్ ముగించుకుని నిత్యానందరెడ్డి, అతని సోదరుడు కారులో బయలు దేరడానికి సిద్ధమయ్యారు. అదే సమయంలో ఓ ఆగంతకుడు ఆకస్మాత్తుగా కారులోకి ప్రవేశించి నిత్యానందరెడ్డి పాయింట్ బ్లాక్ రేంజ్ తుపాకీ నుంచి మిమ్మల్ని కిడ్నాప్ చేస్తున్నామని, సహకరించకపోతే కాల్పులు జరుపుతానని హిందీలో హెచ్చరించాడు.
వెంటనే అప్రమత్తమైన నిత్యానందరెడ్డి ఆత్మరక్షణ కోసం ఆగంతకుడి వద్ద ఉన్న గన్ను లాక్కునే ప్రయత్నం చేశాడు. దుండగుడితో నిత్యానందరెడ్డి అతని సోదరుడు పెనుగులాడటంతో దుండగుడి చేతులోని గన్ ఫైర్ అయ్యింది. సుమారు పది బుల్లెట్లు రిలీజ్ అవడంతో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. వెంటనే కిడ్నాపర్ అక్కడి నుంచి పరారయ్యాడు. దుండగుడు కారు ముందు నుంచి పరిగెత్తుకుంటూ అన్నపూర్ణ స్టూడియో వైపు పారిపోయాడని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. డబ్బుల కోసమే కిడ్నాప్ చేస్తున్నామని ఆగంతకుడు చెప్పినట్లు తెలుస్తోంది.
కెసిఆర్ ప్రకటన
కేబీఆర్ పార్క్ వద్ద బుధవారం ఉదయం జరిగిన కాల్పుల ఘటనపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అసెంబ్లీలో ప్రకటన చేశారు. అరబిందో ఫార్మా వైస్ ఛైర్మన్ నిత్యాంద రెడ్డి వాకింగ్కు వెళ్లిన సమయంలో కిడ్నాప్ చేసేందుకు గుర్తు తెలియని వ్యక్తి ప్రయత్నించాడని, ఏకే 47 గన్తో బెదిరించాడని, దీంతో అప్రమత్తమైన నిత్యానందరెడ్డి తప్పించుకున్నారని, దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని కేసీఆర్ తెలిపారు.
నిత్యానంద రెడ్డి వాకింగ్ ముగించుకొని కారు ఎక్కే సమయంలో ఆయనతో పాటు ఓ అగంతకుడు కారులోకి ఎక్కాడని కేసీఆర్ తెలిపారు. అగంతకుడు ఏకే 47 చూపించి డబ్బులు డిమాండ్ చేశారన్నారు. ఇరువురి మధ్య పెనుగులాట జరిగి, బుల్లెట్లు కారు బాడీలోకి దూసుకెళ్లాయన్నారు. నిత్యానంద తమ్ముడు ప్రసాద రెడ్డి అగంతకుడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే.. ఆయన చేతి కొరికి పారిపోయాడని తెలిపారు.
ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఐపీసీ 307, 367 సెక్షన్ల కింద కేసు నమోదు అయిందని కేసీఆర్ తెలిపారు. ఈ కాల్పుల ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, ఆగంతకుడు ఉపయోగించిన గన్ గ్రేహేండ్స్కు చెందినదిగా పోలీసులు గుర్తించారని, గత ఏడాది డిసెంబర్ 26న ఆ రైఫిల్ గ్రేహెండ్స్ నుంచి దొంగిలింపబడిందని... ఆ ఘటనపై కూడా 408, 385 సెక్షన్ల కింద నార్సింగ్ పీఎస్లో కేసు నమోదు అయి, విచారణలో ఉందని ఆయన తెలిపారు.