పోలవరం కొత్త అంచనాలకు ఓకే, ఏపీకే అధిక ప్రాధాన్యం: గడ్కరీ, చంద్రబాబు పొగడ్తలు
పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. అనంతపురం, అమరావతి రహదారి నిర్మాణంలో భూసేకరణకు అయ్యే వ్యయంలో 50 శాతం భరించడానికి కూడా ఆయన అంగీకరించారు.
విజయవాడ: పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. అలాగే అనంతపురం, అమరావతి రహదారి నిర్మాణంలో భూసేకరణకు అయ్యే వ్యయంలో 50 శాతం భరించడానికి కూడా ఆయన అంగీకరించారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ..ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన విందులో ఈ మేరకు అంగీకారం కుదిరింది. లంచ్ టేబుల్పై రెండు అంశాల ఆవశ్యకతను చంద్రబాబు కేంద్రమంత్రి గడ్కరీకి గట్టిగానే వివరించారు.
లంచ్ టేబుల్ పై మాటా మంతీ...
జలరవాణా ప్రాజెక్టు ప్రాథమిక దశ పనుల శంకుస్థాపన, జాతీయ రహదారుల ప్రారంభోత్సవానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీలను సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. వారి సమక్షంలో కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. తర్వాత వారి గౌరవార్థం విందు ఇచ్చారు. సీఎం, వెంకయ్య నాయుడు, గవర్నర్ నరసింహన్, కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, సుజనా చౌదరి, స్పీకర్ కోడెల ఒకే టేబుల్పై కూర్చున్నారు.
ఢిల్లీకి రండి.. పనైపోతుంది..
2010-2011లో పోలవరం అంచనా వ్యయం రూ. 16 కోట్లు కాగా సవరించిన అంచనాల ప్రకారం రూ. 58,319 కోట్లుగా ఉందని దీనిని వెంటనే ఆమోదించాలని చంద్రబాబు, గడ్కరీని కోరారు. ఈ అంశం కేంద్ర జలసంఘం పరిశీలనలో ఉందని వచ్చేవారం ఢిల్లీకి వచ్చి పని చేయించుకోవాలని, వెంటనే ఆమోదిస్తామని గడ్కరీ హామీ ఇచ్చారు. మొత్తం అంచనా వ్యయంలో రూ. 33,858 కోట్లు కేవలం భూసేకరణకే సరిపోతుందని నీటిపారుదల శాఖ ప్రిన్స్పల్ సెక్రటరీ శశిభూషణ్ వివరించారు. దీనిపై స్పందించిన గడ్కరీ వచ్చేవారం సుజనా చౌదరీతో కలిసి తనవద్దకు రావాల్సిందిగా చెప్పారు. వెంటనే సమస్యను పరిష్కరిస్తామని, కేంద్రం నుంచి రావాల్సిన రూ. 2,800 కోట్లు వెంటనే విడుదలయ్యేలా చూస్తామని అన్నారు.
గడ్కరీ దృష్టికి పలు విషయాలు...
ఈ సమయంలో చంద్రబాబు జోక్యం చేసుకుని పోలవరంను పూర్తి చేయాల్సిన ఆవస్యకతను వివరించారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మించకపోతే 13 లక్షల ఎకరాలు బీడుగా మారిపోయేవని తెలిపారు. శ్రీశైలం సాగర్లో పరిస్థితిని ఆయన గడ్కరీ దృష్టకి తీసుకువచ్చారు. పోలవరం పూర్తి చేస్తే ఏపీలో తాగునీటి సమస్య 50 శాతానికి పైగా పరిష్కారమవుతుందని తెలిపారు. వెంకయ్య కూడా చంద్రబాబు వాదనకు మద్దతు తెలుపుతూ నదుల అనుసంధానమే సమస్యకు పరిష్కారమని, ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక ఏడు మండలాలను కలిపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఏపీకే అధిక ప్రాధాన్యం: గడ్కరీ
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఒక్క ఏపీలోనే లక్ష కోట్ల ఖర్చుతో జాతీయ రహదారులను నిర్మిస్తున్నామని అన్నారు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే కొత్త రాష్ట్రమైన ఏపీ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని గడ్కరీ తెలిపారు. జల రవాణా తన డ్రీమ్ ప్రాజెక్టు అని, రోడ్డు మార్గంతో పోలిస్తే జలరవాణాకు అయ్యే ఖర్చు చాలా తక్కువని ఆయన చెప్పారు. శంకుస్థాపన కార్యక్రమాల తర్వాత గడ్కరీ పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులను పరిశీలించారు.
జాతీయ జలరవాణా మార్గానికి వెంకయ్య శంకుస్థాపన...
4వ జాతీయ జలరవాణా మార్గానికి మంగళవారం ఉపరాష్ట్రపతి వెంక్యనాయుడు విజయవాడలో శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు, గడ్కరీ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రానికి భారీగా హైవే ప్రాజెక్టులు రావడం ఇదే ప్రథమమని చంద్రబాబు అన్నారు. వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో పెద్ద ఎత్తున జాతీయ రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని సీఎం గుర్తు చేశారు. ఈ సందర్భంగా గడ్కరీపై చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. ఆయన ఏ పని మొదలెట్టినా పూర్తి అయ్యేవరకు వెనక్కి తగ్గరని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యేందుకు పూర్తి స్థాయిలో సహాకారం అందించాలని కోరారు. గడ్కరీపై తనకు నమ్మకం ఉందని అన్నారు. విశాఖ, రాయ్పూర్, అమరావతి, అనంతపురం ఎక్స్ ప్రెస్వే నిర్మాణానికి కూడా కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు.