22న పోలవరాన్ని సందర్శించనున్న గడ్కరీ: గంటన్నరపాటు దేవినేని భేటీ
ఢిల్లీ: డిసెంబర్ 22న పోలవరం ప్రాజెక్టును పరిశీలిస్తామని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. మంగళవారం పోలవరం ప్రాజెక్టుపై కేంద్రమంత్రి గడ్కరీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఏపీ జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రధాన గుత్తేదారు ట్రాన్స్ట్రాయ్ కంపెనీ ప్రతినిధి, పలువురు కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులు సమీక్షకు హాజరయ్యారు.
2019 నాటికి ఎట్టిపరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తికావాల్సిందేనని గడ్కరీ తేల్చిచెప్పారు. తాను ఆశించిన లక్ష్యంతో పనులు పూర్తి చేయకపోతే ఊరుకోనని స్పష్టం చేశారు. ప్రధాన గుత్తేదారు అనుకున్న లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాల్సిందేనన్నారు.
ఉప గుత్తేదారులు కూడా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని, ప్రధాన గుత్తేదారు డబ్బులు ఇవ్వకపోతే తానే ఇస్తానని వెల్లడించారు. రూ.7లక్షల కోట్లతో పని చేయించా.. ఇదొక లెక్క కాదని, డబ్బుల విషయంలో ఎటువంటి ఇబ్బంది రాదని గడ్కరీ భరోసా ఇచ్చారు.
పోలవరంపై మరో చిక్కుముడి: గడ్కరీకి బాబు ఫోన్, కాంగ్రెస్ నిరసన
డిసెంబర్ 22న పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తానని, 4,5 గంటలు అక్కడే ఉండి క్షేత్రస్థాయిలో పనులు పరిశీలిస్తానని తెలిపారు. కాగా, జలవనరుల శాఖకు చెందిన అన్ని సమస్యలను పరిష్కరిస్తానని గడ్కరీ హామీ ఇచ్చారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారని చెప్పారు. రూ.381కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు.
కాగా, గంటన్నరకుపై ఈ సమావేశం జరిగింది. కాంట్రాక్టర్ ప్రతినిధులను బయటకు పంపి మరోసారి మంత్రి దేవినేని, అధికారులతో గడ్కరీ సమావేశం నిర్వహించడం గమనార్హం. పోలవరం ప్రాజెక్టు సంబంధించిన అన్ని అంశాలను సీఎం చంద్రబాబుతో మాట్లాడతామని చెప్పారు. కాంట్రాక్టర్ను మారిస్తే పోలవరం పనులు ఆలస్యమవుతాయని అన్నారు.