పోలవరంపై బాబుకు కన్నా ఊహించని షాక్: గడ్కరీ సందర్శన, టీడీపీXబీజేపీ
రాజమహేంద్రవరం: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ బుధవారం పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తున్నారు. అంతకుముందే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. పనులు జరుగుతున్న తీరుపై అధికారులతో సమీక్ష జరిపారు. అనంతరం గడ్కరీ వచ్చాక ఇద్దరు కలిసి పరిశీలించారు. ప్రాజెక్టు వద్ద పార్టీ నేతలు, నిర్వాసితులతో గడ్కరీ భేటీ కానున్నారు.
Recommended Video
కేంద్రం ఒక్క పైసా బాకీలేదు
పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం రాష్ట్రానికి ఒక్క పైసా బాకీ లేదని ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ తేల్చి చెప్పారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని, దానితో రాష్ట్రానికి ఏం సంబంధమని ప్రశ్నించారు. కేంద్రం, కాంట్రాక్టుల మధ్య రాష్ట్ర ప్రభుత్వం కేవలం సమన్వయకర్త మాత్రమేనని స్పష్టం చేశారు.
పోలవరంపై మీ పెత్తనం ఏమిటి?
గడువులోగా పోలవరం ప్రాజెక్టును కేంద్రం నిర్మించి తీరుతుందని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. కేంద్రం నిర్మిస్తున్న పోలవరంపై రాష్ట్రం పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. నిజాలు చెప్తున్నామనే తమపై దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. దాడులు జరిగినా తాము భయపడే ప్రసక్తి లేదన్నారు. వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతామని తెలిపారు. కాగా, పోలవరంపై రాష్ట్రం పెత్తనం ఏమిటని కన్నా పేర్కొనడం గమనార్హం. ఇది చంద్రబాబుకు షాకే అంటున్నారు.
పోలవరం ప్రాజెక్టు వద్ద స్వల్ప ఉద్రిక్తత
గడ్కరీ వచ్చే హెలిప్యాడ్ వద్దకు తమను అనుమతించాలని బీజేపీ కార్యకర్తలు అంతకుముందు ఆందోళన నిర్వహించారు. అయితే పోలీసులు మాత్రం పాస్లు ఉన్న వారినే అనుమతిస్తామని చెప్పారు. దీంతో పోలీసులు, బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు.
ప్రాజెక్టు పనుల్లో వేగం పెరిగే ఛాన్స్
కాగా, పోలవరం పనుల పురోగతిపై గడ్కరీ పది నెలల కాలంలో రెండోసారి సందర్శిస్తున్నారు. గడ్కరీ పర్యటన వల్ల ప్రాజెక్టు పనులు మరింత వేగంగా సాగడానికి అవకాశముందని భావిస్తున్నారు. గత ఏడాది గడ్కరీ వచ్చిన సమయంలో ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని సమస్యలు వచ్చాయి. చర్చల అనంతరం పనులను నవయుగ ఇంజినీరింగ్ కంపెనీకి అప్పగించారు.