పోలవరం 56శాతం పూర్తి, నిధులు రావాలి: దేవినేని, 11న నితిన్ గడ్కరీ సందర్శన
అమరావతి: పోలవరం పనులు 56శాతం పూర్తయ్యాయని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుపై ఇప్పటి వరకు 66 సార్లు సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారని తెలిపారు. సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
పోలవరం ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు రూ.13,798 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. నాలుగేళ్లలో రూ.8660 కోట్ల పనులు చేయగా.. రూ.6727 కోట్లు కేంద్రం ఇచ్చిందని మంత్రి తెలిపారు. డీపీఆర్-1కు సంబంధించి రూ.431 కోట్ల నిధులు రావాల్సి ఉందన్నారు.
Recommended Video
మే నెలాఖరు వరకూ ఖర్చు చేసిన 1335 కోట్ల రూపాయిలకు బిల్లు పంపించామని ఆయన అన్నారు. జూన్లో చేసిన ఖర్చులకు సంబంధించి వచ్చేవారం అప్డేట్ చేస్తామని ఆయన అన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు లేవని కొందరు చెప్పడం సరికాదన్నారు.
11న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి జులై 11న రాష్ట్రానికి రానున్నారని, ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారని మంత్రి దేవినేని ఉమ తెలిపారు. కాగా, పోలవరం ప్రాజెక్టు సందర్శన విషయంలో వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇప్పుడు పోలవరం సందర్శనకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
పోలవరం నిధుల విషయంలో కేంద్రం, రాష్ట్రాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శల జోరు సాగుతున్న సంగతి తెలిసిందే. అలాగే నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ పోలవరం పనులపై ఇచ్చిన స్టాప్ ఆదేశాలపై కేంద్రం ఇచ్చి స్టే జులై 2తో ముగిసింది. ఆ స్టేను పొడిగించాల్సిన కేంద్రం మరి కొంత గడువు కావాలని పేర్కొన్న నేపథ్యంలో గడ్కరీ పర్యటన ప్రాధాన్యత ఏర్పడింది.