జగన్కు నితీశ్ కుమార్ ఫోన్- రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల్లో మద్దతుకు వినతి..
ఈ నెల 14 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో తొలి రోజే రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక జరగబోతోంది. ప్రస్తుతం డిప్యూటీ ఛైర్మన్గా ఉన్న హరివంశ్ నారాయణ్ సింగ్ రాజ్యసభ పదవీకాలం ముగిసిపోవడంతో ఆయన్ను సొంత పార్టీ జేడీయూ మరోసారి రాజ్యసభకు పంపుతోంది. అలాగే ఎన్డీయే తరఫున డిప్యూటీ ఛైర్మన్ అభ్యర్ధిగానూ నిలబెట్టింది.
Recommended Video
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ అభ్యర్ధిగా హరివంశ్ నారాయణ్ సింగ్ను నిలబెట్టిన ఎన్డీయే ఎగువసభలో తమకు పూర్తి మెజారిటీ లేకపోవడంతో ఆయనకు మిగతా పార్టీల నుంచి మద్దతు కూడగట్టే పనిలో ఉంది. ఇదే కోవలో రాజ్యసభలో ఆరుగురు సభ్యుల బలం ఉన్న వైసీపీని కూడా మద్దతు కోరింది.
ఎన్డీయేతో పాటు జేడీయూ తరఫున కూడా రంగంలో నిలిచిన హరివంశ్ నారాయణ్ సింగ్కు మద్దతివ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్కు బీహార్ సీఎం నితీశ్ కుమార్ నిన్న రాత్రి ఫోన్ చేశారు. గతంలో హరివంశ్ను డిప్యూటీ ఛైర్మన్ చేసేందుకు వైసీపీ అప్పట్లో మద్దతిచ్చింది. దీంతో మరోసారి తమ మద్దతు కొనసాగించాలని నితీశ్ జగన్ను కోరినట్లు తెలిసింది. దీనికి జగన్ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది.
మరోవైపు రాజ్యసభ ఎన్నికల్లో విపక్షాల తరఫున మనోజ్ ఝాను నిలబెట్టాలని కాంగ్రెస్తో పాటు దాని మిత్రపక్ష పార్టీలు భావిస్తున్నాయి. ఎన్డీయే తరఫున హరివంశ్ ఇప్పటికే నామినేషన్ దాఖలు చేయగా.. విపక్షాల తరఫున ఆర్దేడీ ఎంపీ మనోజ్ ఝా ఇవాళ నామినేషన్ వేయనున్నారు. ఆయనకు కాంగ్రెస్, ఆర్జేడీతో పాటు తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, వామపక్షాలు మద్దతివ్వబోతున్నట్లు తెలుస్తోంది. అయితే రాజ్యసభలో బలాబలాలు, ప్రస్తుత పరిస్ధితులను బట్టి చూస్తే మరోసారి ఎవ్డీయే అభ్యర్ధికే విజయావకాశాలు కనిపిస్తున్నాయి.