కడప ,ప్రకాశం జిల్లాలలో నివర్ బీభత్సం ఇలా: శ్రీవారి మెట్ల మార్గం తాత్కాలిక మూసివేత
నివర్ తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అతలాకుతలమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండగా, నెల్లూరు, కర్నూలు, చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాలను వరద ముంచేస్తుంది. కడప జిల్లాలో తుఫాను ప్రభావంతో కురుస్తున్న విస్తారమైన వర్షాలకి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. బుగ్గవంక ప్రాజెక్టు నీటితో నగర ప్రజలు రాత్రంతా భయం గుప్పిట్లో గడిపారు. అధికారులు బుగ్గవంక పరివాహక ప్రాంతాల కు చెందిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
కడపలో లోతట్టు ప్రాంతాలు జలమయం .. పునరావాస కేంద్రాలకు ప్రజల తరలింపు
10 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు వరద సహాయక చర్యలను యుద్ధప్రాతిపదికన చేస్తున్నారు. ఇప్పటికే కడప జిల్లాలో నివర్ తుఫాను ప్రభావం వల్ల ఏడు కోట్ల రూపాయలకు పైగా పంట నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. ప్రస్తుతం కడపలో నాగరాజు పేట, రవీంద్ర నగర్, మరాఠి వీధి, బిస్మిల్లా నగర్, ఓల్డ్ రిమ్స్ ఏరియా ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లవలసిందిగా అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రకాశం జిల్లాలో పొంగిపొరలుతున్న నేలవాగు
మరోవైపు ప్రకాశం జిల్లాలోనూ వరదలు జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో తుఫాను ప్రభావంతో సముద్రతీర ప్రాంత గ్రామాలలో భారీగా ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుంది. అద్దంకి ముండ్లమూరు మధ్య చిలకలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే నాగులుప్పాడు మండలం కొత్తకోట వద్ద నేలవాగు పొంగి ప్రవహిస్తోంది. దీంతో వాగు సమీపంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ప్రకాశం జిల్లా నేల వాగులో యువకుడు గల్లంతు .. నెల్లూరులో వరదలో ఆర్టీసీబస్సు
ప్రకాశం జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కొత్తకోట వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది . వాగు ఉధృతికి కార్ కొట్టుకుపోయింది. దీంట్లో ప్రయాణిస్తున్న రాజేష్ అనే యువకుడు గల్లంతయ్యాడు . కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. గల్లంతైన రాజేష్ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే సమయంలో నెల్లూరు జిల్లాలోనూ ఆర్టీసీ బస్సు వరదలో చిక్కుకుపోయింది. తిప్పవారిపాడు వద్ద వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సులో ఉన్న ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు . సమాచారం అందుకున్న పోలీసులు రెస్క్యూ టీం సంఘటన స్థలానికి చేరుకొని ప్రయాణికులు ద్వారా రక్షించారు. సహాయక చర్యలను అధికారులు పరిశీలిస్తున్నారు.
నివర్ ప్రభావం ... తిరుమలలో శ్రీవారి మెట్ల మార్గం మూసివేత
అటు తిరుమలలోనూ నివర్ తుపాను ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. తిరుమల కొండపై విపరీతంగా వర్షం కురుస్తున్న కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం భద్రతా చర్యలు చేపట్టింది. తాత్కాలికంగా మూసివేసింది మెట్ల మార్గంలో భక్తులను అనుమతించే తేదీని త్వరలో ప్రకటిస్తామని టీటీడీ వెల్లడించింది. మరోవైపు విరిగి పడుతున్న కొండ చరియలను, చెట్లను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. ఇంకా తిరుమలలో జోరు వాన కురుస్తూనే ఉంది . అధికార యంత్రాంగం అప్రమత్తమై తగు జాగ్రత్తలు తీసుకుంటుంది.