చిత్తూరును వణికిస్తున్న 'నివర్' తుఫాన్.. 9 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు..
చిత్తూరు జిల్లాను నివర్ తుఫాన్ వణికిస్తోంది. తుఫాన్ ప్రభావంతో జిల్లావ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయి. నదీ పరివాహక ప్రాంతాల్లోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. స్వర్ణముఖి నది ఉప్పొంగడంతో నడుంపల్లి గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. గత రెండు రోజులుగా అక్కడి జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వరద ఇలాగే కొనసాగితే తమ పరిస్థితేంటని అక్కడి జనం భీతిల్లుతున్నారు.
Recommended Video
ఉప్పొంగుతున్న భీమ,స్వర్ణముఖి
చంద్రగిరి సమీపంలోని భీమ,స్వర్ణముఖి నదులు ఉప్పొంగుతుండటంతో సమీప గ్రామాలకు వరద పోటెత్తుతోంది. వరద కారణంగా రహదారులు కొట్టుకుపోవడంతో 9 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎర్రావారిపాలెం మండలంలోని బాకారపేట,వలసపల్లి,బోడేవాండ్లపల్లి గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. రామచంద్రాపురంలోని రాయల చెరువు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ముందు జాగ్రత్తలో భాగంగా లోతట్టు గ్రామాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
కొట్టుకుపోయిన బ్రిడ్జి...
జిల్లాలోని కల్యాణి డ్యామ్కు వరద పోటెత్తింది. దీంతో ఏ క్షణమైనా గేట్లను ఎత్తేసేందుకు అధికారులు సిద్దంగా ఉన్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. అరణియారు,మల్లెమడుగు,కాలకి రిజర్వాయర్లకు వరద పోటెత్తడంతో పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకున్నాయి. దీంతో అధికారులు రిజర్వాయర్ల గేట్లను ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. వరదల ధాటికి పుంగనూరు నియోజకవర్గంలోని ఓ వంతెన కొట్టుకుపోయింది.
కంట్రోల్ రూమ్స్ ఏర్పాటుకు ఆదేశాలు..
నివర్ తుఫాన్ ప్రభావంతో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కడప, అనంతపురం జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి జిల్లాలో ఒక కంట్రోల్ రూం ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలని.. ఎవరికి ఏ సాయం కావాలన్నా... తక్షణమే అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.నెల్లూరు జిల్లాలో విద్యుత్ షాక్తో మరణించిన వ్యక్తి కుటుంబాన్ని ఆదుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.
తిరుమల,తిరుపతి స్తంభించిన జనజీవనం...
ఎడతెరిపి లేని వర్షాలు తిరుమల,తిరుపతిలో జనజీవనాన్ని స్తంభింపజేశాయి. తిరుపతిలో రెండు రోజులుగా వీధి వ్యాపారులు ఇళ్లకే పరిమితమయ్యారు. తిరుమలలో శ్రీవారి ఆలయ ప్రాంతంతో పాటు మాడవీధుల్లో వరద నీరు చేరింది. స్వామి దర్శనం కోసం వెళ్లే భక్తులకు ఇక్కట్లు తప్పట్లేదు. చలి తీవ్ర కూడా పెరగడంతో చాలామంది భక్తులు తమ గదులకే పరిమితమయ్యారు. ఈదురుగాలులకు మొదటి ఘాట్ రోడ్డులో ఓ భారీ వృక్షం నేలకొరిగింది. మరికొన్నిచోట్ల వృక్షాలతో పాటు కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షాల కారణంగా కాలి బాట మార్గాన్ని అధికారులు మూసివేశారు.