ఉగ్రరూపం దాలుస్తున్న నివర్ తుఫాన్... తిరుమలలో భారీ వర్షం,విరిగిపడ్డ కొండచరియలు...
వాతావరణశాఖ వెల్లడించినట్లుగానే బుధవారం అర్ధరాత్రి,గురువారం తెల్లవారుజామున 2.30గంటల మధ్య పుదుచ్చేరి సమీపంలో నివర్ తుఫాన్ తీరం దాటింది. దీని ప్రభావంతో తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. అక్కడి హరిణి ఘాట్ రోడ్డు ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది జేసీబీ సాయంతో వాటిని తొలగిస్తున్నారు. తుఫాన్ అతితీవ్ర రూపం దాల్చడంతో తిరుమలను భారీ వర్షం ముంచెత్తుతోంది. శ్రీవారం ఆలయంలోకి కూడా నీళ్లు చేరడంతో మోటార్లతో బయటకు పంపింగ్ చేస్తున్నారు.
బలమైన ఈదురు గాలులు...
తుఫాన్ ప్రభావంతో గంటకు 120-145కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో తిరుమలలో పాపవినాశనం వద్ద పలు చెట్లు నేలకూలాయి. బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్ వద్ద ప్రహారీ గోడ కూలి కొన్ని బైక్లు ధ్వంసమయ్యాయి. తిరుమలతో పాటు నెల్లూరు,కర్నూలు,కడప,ప్రకాశం జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తలో భాగంగా నెల్లూరు,చిత్తూరు,ప్రకాశం జిల్లాల్లో 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు.
నెల్లూరులో భారీ వర్షాలు
నివర్ తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లాలోని నెల్లూరు, నాయుడుపేట, తడ, సూళ్లూరుపేట, గూడూరు, వాకాడు, కోట, మనుబోలు, ముత్తుకూరు, కావలి పట్టణాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈదురు గాలులకు కొన్నిచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో ఆ ప్రాంతాలకు అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. సురక్షితం కాని ఇళ్ల నుంచి ప్రజలు పునారాస కేంద్రాలకు తరలివెళ్లాలని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది.అలాగే రైతులు పంటలు దెబ్బతినకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించింది.
నిండు కుండల్లా చెరువులు...
భారీ వర్షాలకు నెల్లూరు జిల్లాలోని 1600 చెరువులు నిండు కుండల్లా మారాయి. దీంతో చెరువులకు గండ్లు పడకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. సోమశిల,కండలేరు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరడంతో సముద్రంలోకి ఆ నీటిని విడుదల చేశారు. తీర ప్రాంతాల్లో,లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితులను అధికారులు అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 5వేల మంది సిబ్బందిని సహాయక చర్యల్లో మోహరించారు. జిల్లా వ్యాప్తంగా 100 తుఫాన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. నెల్లూరు కలెక్టరేట్లో టోల్ఫ్రీ నెంబర్ - 1077ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
Recommended Video
కడప,చిత్తూరు అధికారులు అప్రమత్తం...
తుఫాన్ కారణంగా గురువారం(నవంబర్ 26) కడప జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించామని కలెక్టర్ సి.హరికిరణ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.నివర్ తుఫాన్ సహాయక చర్యల కోసం ప్రత్యేక పోలీసు బలగాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ తెలిపారు. కడప కలెక్టరేట్, రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయాలతో పాటు, జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. అటు చిత్తూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు రేణిగుంటలో బాలాజీ కాలనీ నీటమునిగింది. తిరుపతిలో లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. పలు ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి. జిల్లాలో విద్యా సంస్థలకు గురువారం సెలవు ప్రకటించారు.