ఏపీలో కొత్త బార్లకు ఐదురోజులైనా దరఖాస్తులు నిల్.... రీజన్ ఇదే
వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మద్యపాన నిషేధంపై దృష్టి సారించి దశల వారీగా మద్య నియంత్రణ చేపట్టారు. ఇక తాజాగా బార్ల విషయంలో నూతన పాలసీ ప్రవేశపెట్టటంతో వ్యాపారులు దరఖాస్తు చేసుకునేందుకు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. ఇక తాము అధికారంలోకి వస్తే దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పిన జగన్ ఆ దిశగా అడుగులు వేసే క్రమంలో భాగంగా జనవరి 1 నుండి బార్ల పైన కూడా నూతన విధానం అమలు చెయ్యాలని భావిస్తున్నారు. దీంతో పెంచిన దరఖాస్తు ఫీజు వ్యాపారులను నాలుగడుగులు వెనక్కు వేయిస్తుంది.
మద్యం కేసుల్లో శిక్ష పడితే నో లైసెన్స్: ఏపీలో బార్ల కేటాయింపు నూతన పాలసీ ఇదే
Recommended Video
జనవరి 1 నుంచి బార్ల కేటాయింపులో నూతన పాలసీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా ఏపీ సర్కార్ అడుగులు వేస్తుంది. జనవరి 1 నుంచి బార్ల కేటాయింపులో నూతన పాలసీని తీసుకురావాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం నియమ నిబంధనలను కఠినతరంచేసింది . ఇక ఈ మేరకు నియమ నిబంధనలతో ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం నూతన విధానం ప్రకారం మద్యం కేసుల్లో శిక్షలు పడినవారికి లైసెన్స్ ఇవ్వమని తేల్చిచెప్పింది.అంతే కాకుండా దరఖాస్తు ఫీజును 10 లక్షల రూపాయలుగా నిర్ణయించింది. ఇది నాన్ రిఫండబుల్.
బార్లు నడపాలంటే ఏపీలో కొత్త నిబంధనలు
బార్ కు దరఖాస్తు చేసుకునేవారు ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ యాక్ట్ 2006 ప్రకారం లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. ఇక బార్ల నిర్వహణ సమయాలను సైతం ప్రకటించిన సర్కార్ ఉదయం 11 గంటల నుండి రాత్రి పది గంటల వరకు మాత్రమే బార్లను నిర్వహించవలసిందిగా పేర్కొంది. ఇక ఆహార సరఫరా 11 గంటల వరకు చేయవచ్చని తెలిపింది.
బార్ లైసెన్స్ ఫీజు పెంచిన ప్రభుత్వం .. 10 లక్షలు దరఖాస్తు ఫీజు కట్టటంపై నిరాసక్తత
ఇక ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో కొత్త బార్లకు వ్యాపారుల నుంచి ఏ మాత్రం స్పందన కనిపించడం లేదు. లైసెన్స్ లకు దరఖాస్తు చేసుకోమని నోటీసులు జారీ చేసి ఐదు రోజులు గడుస్తున్నా ఒక్కటంటే, ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడం ఏపీలో వ్యాపారుల నిరాసక్తతకు అద్దం పడుతుంది . బార్ లైసెన్స్ కావాలంటే రూ. 10 లక్షలు కట్టాల్సివుండటం, లాటరీలో బార్ లైసెన్స్ తగలకుంటే, కట్టిన డబ్బు వెనక్కు వచ్చే పరిస్థితి లేకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని అధికారులు అంటున్నారు.
లాటరీ రాకుంటే 10లక్షలు పోతాయన్న బాధ ప్రధాన కారణం
ఒకవేళ రాకుంటే 10లక్షలు పోతాయన్న బాధ ఉండటం ఒక కారణం అయితే మద్య నియంత్రణ దిశగా ప్రభుత్వం అడుగులు వెయ్యటంతో ఒకవేళ బార్ లైసెన్స్ వచ్చినా ఏదో ఒక నిబంధనలతో బిజినెస్ చెయ్యలేమనే అనుమానం కూడా వ్యాపారులను వెన్నాడుతుంది. ఇదే సమయంలో బార్ లను నడుపుతున్న పలువురు కోర్టును ఆశ్రయించడంతో, కోర్టు తీర్పు వచ్చేంత వరకూ ఆగాలని వ్యాపారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
కోర్టులో బార్ల నిర్వాహకులు వేసిన కేసు కూడా కారణం
ఇక కొందరు వ్యాపారులు గత ప్రభుత్వం ఇచ్చిన గడువుకు ముందే లైసెన్సులు రద్దు చేశారంటూ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కోర్టులో కొత్త బార్లకు అనుకూలంగా తీర్పు రాకుంటే డబ్బులు వెనక్కి వస్తాయా? అన్న సందేహంలోనూ వ్యాపారులు ఉన్నారని సమాచారం . లైసెన్స్ కోసం రూ. 10 లక్షలు కట్టాల్సి రావడం తమపై భారమేనని వ్యాపారులు అంటున్నారు. కోర్టులో స్పష్టత వచ్చిన తరువాతే ముందడుగు వేయాలని భావిస్తున్నారు. కానీ ఏపీలో సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు మద్యం వ్యాపారులు నాలుగడుగులు వెనక్కు వేసేలానే ఉన్నాయి.