ఇప్పుడు వినం: విభజనపై సుప్రీం, ఐతే ఇబ్బంది: హరీష్
న్యూఢిల్లీ: విభజనపై వాదనలు వినేందుకు ఇది సరైన సమయం కాదని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సోమవారం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పలువురు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిపై సోమవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
విభజనపై ప్రభుత్వం నిర్ణయం ఇంకా తెలియనందున ఆ విధానం తప్పా, కాదా అని ఇప్పుడే చెప్పలేమంది. న్యాయపరమైన అంశాల జోలికి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. పార్లమెంటులో ఇంకా బిల్లు పెట్టలేదని కాబట్టి కేసును విచారించడం కుదరదని తెలిపింది. సరైన సమయంలో విచారణ చేస్తామని తెలిపింది. ప్రభుత్వ వైఖరి వచ్చాక కోర్టును ఆశ్రయించవచ్చునని తెలిపింది.
ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా
విభజన ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా జరుగుతోందని న్యాయవాదులు హరీష్ సాల్వే, నారిమన్లు తమ వాదనలు వినిపించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాజకీయ లబ్ధి కోసమే విభజన జరుగుతోందని, శ్రీకృష్ణ కమిటీ నివేదిక పైన పార్లమెంటులో ఇప్పటి వరకు చర్చించలేదని, రెండేళ్లు దాటినా శ్రీకృష్ణ కమిటీ నివేదిక పైన చర్చ జరగలేదన్నారు. ఎపి విషయంలో కేంద్రం ఎప్పుడు ఏం చేస్తుందో తెలియడం లేదన్నారు.
371 డిని సవరించకుండా, రాష్ట్రపతి సిఫార్సు లేకుండా, శాసనసభ తీర్మానం లేకుండా విభజన సరికాదన్నారు. కేంద్రం సమాఖ్య స్ఫూర్తికి అది విరుద్ధమన్నారు. విభజనపై ముందు రాష్ట్రపతి ప్రతిపాదించాలని, ఆ తర్వాత అసెంబ్లీ ఆమోదం తెలపాలన్నారు. అసెంబ్లీయే విభజించాలని కోరాలన్నారు. ఈ ప్రక్రియ ఎపి విభజనలో జరగడం లేదన్నారు. ప్రీమెచ్యూర్ అని తమ వాదనలు వినకుండే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయన్నారు. పార్లమెంటులో ఆమోదం పొందాక ఏం చేయలేమన్నారు. అయితే సుప్రీం మాత్రం ప్రభుత్వ వైఖరి వచ్చాక కోర్టును ఆవిష్కరించవచ్చునని విచారణను వాయిదా వేసింది.
విభజనపై సుప్రీం కోర్టులో టిడిపి నేతలు సిఎం రమేష్, పయ్యావుల కేశవ్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు రఘురామకృష్ణం రాజు, సోమయాజులు తదితరులు వేశారు. ఆ పిటిషన్లన్నింటిని సుప్రీం ప్రీమెచ్యూర్ అని చెప్పింది.