బీచ్ లవ్ ఫెస్టివల్పై బాబు యూటర్న్: రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన గంటా
బీచ్ లవ్ ఫెస్టివల్ ను రద్దు చేస్తున్నట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం నాడు మీడియాకు వెల్లడించారు.
విశాఖపట్నం: వచ్చే ఏడాది ప్రేమికుల రోజున విశాఖపట్నం సముద్ర తీరంలో బీచ్ లవ్ ఫెస్టివల్ ను నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రజల నుంచి దీని పట్ల భారీ ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవడంతో ప్రభుత్వం వెనుకడుగేయక తప్పలేదు. ఈ మేరకు బీచ్ లవ్ ఫెస్టివల్ ను రద్దు చేస్తున్నట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం నాడు మీడియాకు వెల్లడించారు.
కాగా, బీచ్ లవ్ ఫెస్టివల్ కోసం దేశ విదేశాల నుంచి సుమారు 9వేల జంటలకు ఆహ్వానం పలకాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. సముద్ర తీరాన టెంట్లు వేసి వీరందరికీ అందులో మూడురోజుల పాటు ఆశ్రయం కల్పించాలని ప్రభుత్వం భావించింది. బాలీవుడ్, హాలీవుడ్ తారలతో నృత్యాలు, మ్యూజిక్ షో వంటి కార్యక్రమాలు ప్లాన్ చేసింది. ముంబైకి చెందిన పాజిటివ్ గ్లోబల్ సర్వీసెస్ అండ్ కన్సల్టెన్సీ అనే సంస్థకు ఈ మొత్తం ఈవెంట్ నిర్వహణ బాధ్యతలు అప్పజెప్పారు.
అయితే పాశ్చాత్య ధోరణిని అవలంభిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం యువతను చెడగొట్టేందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని ప్రజాస్వామిక వాదులు, సామాన్య జనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, దేశంలో గోవాలో తప్ప మరెక్కడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిన దాఖలా లేదు.
ఈ నేపథ్యంలోనే.. ప్రతిపక్ష పార్టీ అనుకూల పత్రికయైన సాక్షి సైతం ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని ప్రభుత్వాన్ని ఎద్దేవా చేసింది. బాబు సర్కార్ సమర్పించు 'బీచ్ లవ్' అంటూ కథనాలు ప్రచురించింది. దీంతో ప్రభుత్వం యూటర్న్ తీసుకోక తప్పలేదు.
బుధవారం నాడు విశాఖపట్నంలో మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి గంటా శ్రీనివాసరావు.. బీచ్ లవ్ ఫెస్టివల్ ను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు. దీని స్థానంలో విశాఖ ఉత్సవ్ కార్యక్రమం మూడు రోజుల పాటు జరుగుతుందని తెలిపారు. ప్రతిపక్షం నుంచి, ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో బీచ్ లవ్ ఫెస్టివల్ రద్దు చేయడమే మంచిదన్న ఆలోచనకు సీఎం చంద్రబాబు వచ్చారని చెబుతున్నారు.