బీజేపీకి బాబు ఝలక్: టీటీడీలో నో ఛాన్స్, ఎమ్మెల్యే అలక
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో చోటు దక్కనందుకు ఎమ్మెల్యే ఒకరు అలక వహించినట్లుగా తెలుస్తోంది. సోమవారం నాడు టీటీడీ పాలక మండలిని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భారతీయ జనతా పార్టీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డికి చోటు దక్కుతుందని ఊహాగానాలు వినిపించాయి.
కానీ ఆయనకు దక్కలేదు. దీంతో ఆయన మనస్తాపానికి గురైనట్లుగా తెలుస్తోంది. కేంద్రంలో, రాష్ట్రంలో టీడీపీ - బీజేపీ పొత్తు ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ సభ్యులకు కొందరికి అవకాశం వస్తుందని అందరు భావించారు.
అందులో చింతల రామచంద్రా రెడ్డి పేరు కూడా వినవచ్చింది. తీరా ప్రకటించాక చింతల పేరు లేదు. దీంతో ఆయన అసంతృప్తికి లోనయ్యారని సమాచారం. సొంత పార్టీ నేతల వల్ల కూడా చింతలకు చోటు దక్కి ఉండవకపోవచ్చనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
బీజేపీ నేత, దేవాదాయ మంత్రి పైడికొండల మాణిక్య రావు చేసిన సిఫార్సులను పక్కకుపెట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెదేపాకు పెద్దపీట వేసినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.
మాణిక్యాల రావు సిఫార్సు చేసిన పేర్లలో చింతల రామచంద్రా రెడ్డి పేరు కూడా ఉందని తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ నేతలకే కాకుండా, ఏపీ బీజేపీ నేతలకు కూడా చోటు దక్కక పోవడం గమనార్హం. అదే తెలంగాణకు చెందిన ఇద్దరు టీడీపీ నేతలకు అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా ఎఫెక్ట్ ఏమైనా ఉందా అనే చర్చ కూడా సాగుతోంది.