కథ మొదటికొచ్చింది!: మళ్లీ 'నోట్ల రద్దు' నాటి పరిస్థితులు.. 'నో క్యాష్'
నోట్ల రద్దు తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఏ జిల్లాకు 50శాతానికి మించి ఆర్బీఐ నుంచి తిరిగి డబ్బులు రాలేదు. ఆర్బీఐ తక్కువ మొత్తంలో డబ్బులు పంపిణీ చేస్తుండటమే నగదు కష్టాలకు ప్రధాన కారణమని బ్యాంకులు .
న్యూఢిల్లీ: దేశంలో పరిస్థితులు చూస్తుంటే కథ తిరిగి మొదటికొచ్చినట్లే కనిపిస్తోంది. బ్యాంకులు చేతులెత్తేయడం, ఏటీఎంలలో 'నో క్యాష్' బోర్డులు దర్శనమిస్తుండటంతో సామాన్యుడికి మళ్లీ కరెన్సీ కష్టాలు మొదలయ్యాయి. చాలావరకు ఏటీఎంలు మూసివేసిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. దీంతో నోట్ల రద్దు నాటి పరిస్థితులు మళ్లీ పునరావృతమవుతున్నట్లుగానే అనిపిస్తోంది.
ఫిబ్రవరి నుంచి కరెన్సీ విత్ డ్రా పై ఆంక్షలు ఎత్తివేస్తాం.. ఖాతాదారులు ఎంతైనా తీసుకోవచ్చునన్న ప్రభుత్వ మాటలు తలకిందులైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. బ్యాంకులకు డబ్బులు పంపిణీ చేయాల్సిన చెస్ట్లు వాటిని ముప్పుతిప్పలు పెడుతున్నాయి. దీంతో నెలవారీ జీతం మీద ఆధారపడి జీవించే సగటు సామాన్యుడికి మళ్లీ నోట్ల కష్టాలు మొదలయ్యాయి.
అవుట్ ఆఫ్ సర్వీస్ బోర్డు:
వాస్తవానికి ఏటీఎంలలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేకపోయినప్పటికీ క్యాష్ లేకపోయిన కారణంగా 'అవుట్ ఆఫ్ సర్వీస్' పేరుతో ఖాతాదారులను మభ్యపెట్టాలని చూస్తున్నారు. నోట్ల కష్టాలు తీవ్రతరం అవుతుండటంతో సామాన్యులు ఏటీఎంల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అయితే ఎక్కడకెళ్లినా నో క్యాష్ బోర్డులే దర్శనమిస్తుండటంతో వారిలో అసహనం పెరిగిపోతోంది.
గుంటూరులో పరిస్థితి ఇది:
పెన్షన్లు, జీతాలు, బ్యాంకు నెలసరి ఖర్చులు అన్ని కలిసి ఫిబ్రవరి నెలలో గుంటూరు జిల్లా బ్యాంకులకు రూ.450కోట్ల డబ్బు చేరాల్సి ఉంది. కానీ చేరింది మాత్రం కేవలం రూ.245 కోట్లే. దీంతో సామాన్యులు మరోసారి తీవ్రమైన గడ్డు పరిస్థితులు ఎదుర్కోవడం ఖాయంగానే కనిపిస్తోంది.
నోట్ల రద్దుతో గుంటూరు బ్యాంకుల్లో మొత్తం రూ.13 వేల కోట్ల డిపాజిట్లు జమవగా.. వాటన్నింటిని ఆర్బీఐకి పంపిస్తే తిరిగి బ్యాంకులకు చేరింది మాత్రం కేవలం రూ.3 వేల కోట్లు.
కరీంనగర్ లో పరిస్థితి ఇది:
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ ఎస్బీఐ శాఖలో నోట్ల రద్దుకు ముందు రోజు వరకు రూ.50 లక్షలు ఖాతాదారులకు పంపిణీ చేసేవారు. కానీ నోట్ల రద్దు తర్వాత పరిస్థితి తారుమారైంది. కేవలం రూ.5లక్షలకే అది పడిపోయింది. ఆ తర్వాత దాన్ని పెంచుతూ వచ్చిన ఖాతాదారుల అవసరాలు మాత్రం తీరలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రిజర్వ్ బ్యాంకు నుంచి కొత్త నోట్లు రాని కారణంగా నగదు పంపిణీ మరింత క్షీణించే అవకాశం కనిపిస్తోంది.
ఏటీఎంల పరిస్థితి మరింత అధ్వాన్నం:
అయితే షట్టర్ క్లోజ్ చేసి.. లేదంటే నో క్యాష్ బోర్డులతోనే ఏటీఎంలు దర్శనమిస్తున్నాయి. ఏటీఎంలలో ప్రతి నెల మొదటి వారంలో రూ.150 కోట్లు పెట్టే ఓ బ్యాంకు ఇప్పుడు రూ.40 కోట్లు మాత్రమే పెడుతోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సామాన్యుల్లో పెరుగుతున్న అసహనం దాడులకు దారితీయవచ్చునన్న అనుమానంతో ముందస్తుగా బ్యాంకులు, ఏటీఎంల వద్ద పోలీస్ భద్రత ఏర్పాటు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
బ్యాంకులు ఏం చెబుతున్నాయి?:
పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకులకు భారీ ఎత్తున డిపాజిట్లు చేరిన సంగతి తెలిసిందే. అయితే రిజర్వ్ బ్యాంకుకు చేరిన ఈ డిపాజిట్లను తిరిగి పూర్తి స్థాయిలో విడుదల చేయకపోవడంతోనే దేశంలో పరిస్థితి తలెత్తుతోందని బ్యాంకులు ఆరోపిస్తున్నాయి. అప్పటి డిపాజిట్లలో కేవలం 25-50 మధ్య మాత్రమే రిజర్వ్ బ్యాంకు బ్యాంకులకు పంపిణీ చేస్తోందని బ్యాంకులు చెబుతున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లోను ఇంతే:
నోట్ల రద్దు తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఏ జిల్లాకు 50శాతానికి మించి ఆర్బీఐ నుంచి తిరిగి డబ్బులు రాలేదు. ఆర్బీఐ తక్కువ మొత్తంలో డబ్బులు పంపిణీ చేస్తుండటమే నగదు కష్టాలకు ప్రధాన కారణమని బ్యాంకులు చెబుతున్నాయి.
మరోవైపు బ్యాంకులు, ఏటీఎంల లావాదేవీలపై ఛార్జీల మోత మోగిస్తుండటంతో బ్యాంకుల్లో ఉన్న డబ్బును ఖాతాదారులు ఒకేసారి విత్ డ్రా చేసుకోవడానికి ప్రయత్నిస్తుండటంతో బ్యాంకుల్లో నగదు చలామణి తగ్గిపోయినట్లు చెబుతున్నారు. దాంతో పాటు ఆర్బీఐ నుంచి పంపిణీ అయిన రూ.2వేల నోట్లలో రూ.40వేల కోట్లు కూడా తిరిగి వెనక్కిరాకపోవడం కూడా ఇందుకు ఓ కారణంగా భావిస్తున్నారు.