చంద్రబాబుపై సీబీఐ విచారణ ఉండదు:పురంధేశ్వరీ; పచ్చిఅవకాశవాది:లక్ష్మీపార్వతి
Recommended Video
గుంటూరు:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సీబీఐ విచారణ జరిపించడం తమ పార్టీకి ఇష్టం లేదని బీజేపీ మహిళామోర్చా జాతీయ ఇన్చార్జి పురందేశ్వరి స్పష్టం చేశారు. బుధవారం ఆమె గుంటూరులో మీడియాతో మాట్లాడారు.
పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ 1600 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసిందని పేర్కొన్నారు. ఆ లెక్కలు అడుగుతుంటే చంద్రబాబు చెప్పడం లేదని విమర్శించారు. మరోవైపు రాజమండ్రిలో వైసిపి మహిళా నాయకురాలు లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు పచ్చి అవకాశవాది అని దుయ్యబట్టారు.
సిబిఐ విచారణ ఉండదు:పురంధేశ్వరి
బీజేపీ మహిళామోర్చా జాతీయ ఇన్చార్జి పురందేశ్వరి గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎపి ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై బిజెపి సీబీఐ విచారణ జరిపించదని ఆమె తేల్చేశారు. అలా చేయడం తమ పార్టీకి ఇష్టం లేదని ఆమె అన్నారు. కక్షతో సీబీఐ దాడులు చేయించే సంస్కృతి బీజేపీది కాదని పురందేశ్వరి స్పష్టం చేశారు.
పోలవరం ఘనత...కాంగ్రెస్ దా?
పోలవరం ప్రాజెక్టు ఘనతను చంద్రబాబు కాంగ్రెస్కు ఆపాదించడంపై పురంధేశ్వరి తప్పుబట్టారు. పోలవరం ప్రాజెక్ట్ కు కాంగ్రెస్ ప్రభుత్వం నయా పైసా మంజూరు చేయలేదని ఆమె ఆరోపించారు. యుటిలిటీ సర్టిఫికేట్లు ఇవ్వకుండా రాష్ట్రానికి కేంద్రం నిధులు ఎలా మంజూరు చేస్తుందని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు మించి నిధులు ఇచ్చామని ఆమె స్పష్టం చేశారు.
చంద్రబాబు...అవకాశవాది:లక్ష్మీపార్వతి
వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి రాజమహేంధ్రవరంలో మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పచ్చి అవకాశవాది అంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు తనకు బీజీపీ అంటే ఇష్టమే లేదని ప్రచారం చేసుకోని...తీరా 2014 ఎన్నికలు వచ్చేసరికి నరేంద్ర మోదీ కాళ్లు పట్టుకున్నారని ఆమె ఎద్దేవా చేశారు. అవసరం అనుకుంటే కాళ్లు పట్టుకునే చంద్రబాబు...అవసరం తీరాక విసిరి గోదావరిలో పడేస్తాడని అన్నారు.
కాంగ్రెస్ తో...చంద్రబాబు జట్టు
కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా దివంగత ముఖ్యమంత్రి, నటుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని లక్ష్మీపార్వతి ఈ సందర్భంగా గుర్తుచేశారు. అలాంటిది గతంలో ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి మోసం చేసిన చంద్రబాబు...ప్రస్తుతం టీడీపీకి వ్యతిరేక పార్టీ కాంగ్రెస్తో జతకట్టేందుకు సిద్ధపడుతున్నారని ఆమె ఆరోపించారు. అందుకే చంద్రబాబును గోదావరిలో కలిపేందుకు ఏపీ ప్రజలు సిద్ధమవుతున్నారని లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు.