వలస పక్షులకు ఇప్పట్లో నో ఛాన్స్- క్లారిటీ ఇచ్చేస్తున్న జగన్- కారణమిదేనా ?
ఏపీలో స్ధానిక ఎన్నికల పోరు నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. టీడీపీతో పాటు విపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలు వరుసగా వైసీపీ బాట పట్టేస్తున్నారు. వీరిలో కొందరు అధినేత జగన్ సమక్షంలోనే కండువాలు కప్పుకుంటుండగా, మరికొందరు జిల్లా నేతల వద్దే తీర్ధం పుచ్చుకుంటున్నారు. ఈ వలస నేతల రాక వెనుక కారణాలు అనేకం ఉన్నాయి. అయితే పార్టీలోకి వచ్చే ఫిరాయింపు నేతలందరికీ సీఎం జగన్ ఒక విషయాన్ని మాత్రం కామన్ గా చెప్పేస్తున్నారు.
ఫిరాయింపుల పర్వం
ఏపీలో స్ధానిక ఎన్నికల పోరు నేపథ్యంలో అధికార వైసీపీలోకి వలసల జోరు భారీగా కొనసాగుతోంది. జిల్లా, రాష్ట్ర స్ధాయి నేతలే కాదు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు సైతం వైసీపీ బాట పట్టారు. గత కొన్నిరోజులుగా సీఎం జగన్ తన అధికారిక కార్యక్రమాల కంటే వీరికి కండువాలు కప్పే కార్యక్రమమే జోరుగా కొనసాగిస్తున్నారు.
గతంలో టీడీపీలో సీనియర్లుగా ఉన్నవారు, దశాబ్దాలుగా పార్టీలో కొనసాగిన వారు, మాజీ మంత్రులు, ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు సైతం వైసీపీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. అయితే స్ధానిక ఎన్నికల వేళ వీరి ఫిరాయింపులు వైసీపీకి మేలు చేస్తాయా లేదా అన్న చర్చ మాత్రం సాగుతోంది.
ఫిరాయింపు నేతలకు జగన్ క్లారిటీ..
గతంలో ఫిరాయింపుల విషయంలో మడి కట్టుకు కూర్చున్నట్లు అనిపించిన వైసీపీ అధినేత జగన్ స్ధానిక ఎన్నికల పోరు నేపథ్యంలో కొద్దిరోజులుగా వరుసగా టీడీపీ నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్న తీరు ఒకింత ఆశ్చర్యంగానే కనిపిస్తోంది. అయితే పార్టీలోకి వీరిని ఆహ్వానించడం వెనుక ఉన్న కారణాలు ఏవైనా ఫిరాయింపు నేతలకు మాత్రం జగన్ ఓ విషయంలో చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చేస్తున్నారు. అది పదవుల వ్యవహారం. ప్రస్తుతం స్ధానిక ఎన్నికల వేళ పార్టీలో చేరుతున్న నేతలకు కానీ వారి కుటుంబ సభ్యులు, బంధువులకు కానీ ఇప్పట్లో పార్టీ, ప్రభుత్వ పదవులు ఇవ్వబోమని తేల్చి చెప్పేస్తున్నారు.
జగన్ క్లారిటీతో వారిలో నిరాశ..
వైసీపీలో తాజాగా చేరిన నేతలకు పార్టీ, ప్రభుత్వ పదవులు ఇవ్వబోమని సీఎం జగన్ ఇస్తున్న క్లారిటీ వారికి షాక్ గా మారుతోంది. స్ధానిక ఎన్నికల వేళ అధికార వైసీపీలో చేరడం వల్ల తమ బంధువులు, కుటుంబ సభ్యులు, అనుచరులకు పోటీ చేసే అవకాశం లభిస్తుందని వారంతా ఆశిస్తున్నారు. వీరిలో కొందరు భవిష్యత్ సమీకరణాల దృష్ట్యా అవకాశాలు దక్కుతాయనే ఆశతో కూడా చేరుతున్నారు. అయితే పదవులు ఇవ్వబోమంటూ జగన్ స్పష్టం చేయడంతో వారికి నిరాశ తప్పడం లేదు.
కొన్నాళ్లు ఆగితే గడ్డు పరిస్ధితులు...
స్ధానిక ఎన్నికల నేపథ్యంలో వైసీపీలోకి తామర తంపరగా వస్తున్న నేతలు, వారి అనుచరగణం ఏదో ఒక ప్రయోజనం ఆశిస్తున్న వారే. అయితే ఇప్పుడు మాత్రం వారికి అవకాశాలు ఉండబోవని జగన్ తేల్చిచెప్పేస్తుండటం మాత్రం వారిలో కలవరం రేపుతోంది. గతంలో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదవుల హామీతో చాలా మంది నేతలు చేరిపోయారు. కానీ ఇప్పుడు 151 సీట్లతో అసెంబ్లీలో బలంగా ఉండటం, మండలి రద్దయ్యే పరిస్ధితులు ఉండటం, ఇప్పట్లో రాజ్యసభకు ఖాళీలు కూడా వచ్చే ఛాన్స్ లేకపోవడం వంటి కారణాలతో పార్టీలోకి వచ్చే వారికి జగన్ మొండిచేయి చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే వీరిలో కొందరు మాత్రం పార్టీని, వైఎస్ కుటుంబాన్ని నమ్ముకుని ఉంటే ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులో అయినా న్యాయం జరుగుతుందనే ధీమాతో తమకు తాము సర్దిచెప్పుకుంటున్నారు.