బాబుకు షాక్: వెనక్కి తగ్గేది లేదంటున్న బొజ్జల.. తలపట్టుకున్న అధిష్టానం..
మంత్రి గంటా, ఎంపీ సీఎం రమేశ్ ల రాయబారం విఫలమవడంతో.. బొజ్జలను టీడీపీ ఎలా దారికి తెచ్చుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
శ్రీకాళహస్తి: ఎన్నిసార్లు బుజ్జగించినా.. ఎంత నచ్చజెప్పినా.. మాటంటే మాటే అంటున్నారు శ్రీకాళహస్తీ ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి. సీఎం చంద్రబాబు తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన తన నిర్ణయాన్ని మార్చుకునేది లేదని తెగేసి చెబుతున్నారు. దీంతో ఏం చేస్తే ఆయన దిగివస్తారో తెలియక టీడీపీ అధిష్టానం తలపట్టుకుంది.
టీడీపీ కోసం 35ఏళ్లు కష్టపడితే.. ఇదేనా మీరిచ్చే గౌరవం?: బొజ్జల కుమారుడు
కాగా, ఇప్పటికే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన బొజ్జల.. పార్టీని వీడితే టీడీపీకి భారీ డ్యామేజీ జరిగే అవకాశం ఉంది. దీంతో ఆయనకు ఎలా నచ్చజెప్పాలో తెలియని స్థితిలో టీడీపీ నేతలు కిందా మీద పడుతున్నారు. మంత్రి గంటా, ఎంపీ సీఎం రమేశ్ ల రాయబారం విఫలమవడంతో.. బొజ్జలను టీడీపీ ఎలా దారికి తెచ్చుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు బొజ్జల అనుచరులు సైతం తీవ్ర అవమానంతో రగిలిపోతున్నారు. తొలి నుంచి చంద్రబాబుకు సన్నిహితుడుగా కీలక సమయాల్లో అండగా ఉన్న బొజ్జలను మంత్రివర్గం నుంచి తొలగించడం వారు తీవ్ర అవమానంగా భావిస్తున్నారు. అంతేకాదు, ఎన్ని రాయబారాలు నెరిపినా వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెబుతున్నారు.
మంగళవారం నాడు శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ పోతుగుంట గురవయ్య నాయుడు, తొట్టంబేడు మండలం పార్టీ అధ్యక్షుడు గాలి మురళీనాయుడు సహా పలువురు పార్టీ కీలక నేతలంతా బొజ్జలను హైదరాబాద్ లో కలిశారు. ఈ సందర్బంగా మున్సిపల్ చైర్మన్ రాధారెడ్డి పార్టీతో అంటీముట్టనట్టుగా ఉన్న అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే, మరో రెండు రోజుల్లో బొజ్జల శ్రీకాళహస్తికి రానున్నారు. పార్టీ కార్యకర్తలందరితో సమావేశమై వారి అభిప్రాయం మేరకు భవిష్యత్ కార్యాచరణను బొజ్జల ప్రకటించే అవకాశం ఉంది.