క్లారిటీ లేదు: బొత్సపై పితాని, యుటి ఎవరడిగారు: విష్ణు
ఏలూరు/విజయవాడ: అధిష్టానాన్ని ధిక్కరించిన వారిపై చర్యలు తీసుకుంటామన్న ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యల్లో స్పష్టత లేదని మంత్రి పితాని సత్యనారాయణ గురువారం పశ్చిమ గోదావరి జిల్లాలో అన్నారు. విభజన విషయంలో స్వయంగా బొత్స కూడా అధిష్టానాన్ని వ్యతిరేకించారన్నారు.
లెహర్ తుఫాను తీవ్రత తగ్గడం మంచిదే అన్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పర్యటిస్తారని చెప్పారు. సరైన సమయంలో నీటిని విడుదల చేయకపోవడం వల్లనే పంటలు ఎండిపోయాయని చెప్పడం సరికాదన్నారు. సరైన సమయంలో నీటి విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
కేంద్రమంత్రులపై మల్లాది విష్ణు ఫైర్
హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని కేంద్రమంత్రులను ఎవరు అడిగారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనేదే తమ డిమాండ్ అన్నారు. అసెంబ్లీలో సమైక్యం కోసమే తీర్మానం చేయాలన్నారు.
రాజకీయాలొద్దు: బొత్స
అభివృద్ధికి రాజకీయ రంగు పులిమి ఆటంకం కలిగించవద్దని బొత్స విజయనగరం జిల్లాలో అన్నారు. ఆయన చీపురుపల్లి రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. గత పదేళ్లలో చీపురుపల్లిని జిల్లా కేంద్రం తరహాలో అన్ని రకాలుగా అభివృద్ధి చేశానన్నారు.