ఎస్ఈసీపై వ్యాఖ్యలొద్దు, అభ్యర్ధులతో మాట్లాడొద్దు- వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్కు హైకోర్టు ఆదేశం
ఏపీలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో వైసీపీకి పోటీగా నామినేషన్ వేసే అభ్యర్ధులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కట్ చేస్తామంటూ వివాదాస్పద హెచ్చరికలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్కు హైకోర్టులో స్వల్ప ఊరట మాత్రమే లభించింది. జోగి రమేష్ వ్యాఖ్యలు, అనంతరం ఎస్ఈసీ ఆంక్షలపై విచారణ జరిపిన హైకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు ఇచ్చింది.
ఈ నెల 13 వరకూ ఇంట్లోంచి బయటికి రాకుండా, ఎవరితో మాట్లాడకుండా వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్పై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఆంక్షలు విధించారు. ఎన్నికల్లో ప్రత్యర్ధులకు ఆయన బెదిరింపుల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. అయితే ఎస్ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ జోగి రమేష్ హైకోర్టును ఆశ్రయించారు. వీటిపై లంచ్మోహన్లో విచారణ జరిపిన హైకోర్టు.. ఎస్ఈసీ కానీ, ఎన్నికల ప్రక్రియను కానీ కించపరిచేలా వ్యాఖ్యలు చేయొద్దంటూ ఆయనకు ఆదేశాలు ఇచ్చింది.
అలాగే ప్రభుత్వ పథకాలపై జోగి రమేష్ మీడియాతో మాట్లడొచ్చని, కానీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులతో మాట్లాడొద్దంటూ ఆయనపై ఆంక్షలు విధించింది. దీంతో పాటు జోగి రమేష్కు నోటీసులు జారీ చేసి వివరణ తీసుకోవాలని ఎస్ఈసీ నిమ్మగడ్డకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తన నుంచి వివరణ కూడా తీసుకోకుండానే చర్యలు తీసుకోకుండానే ఎస్ఈసీ చర్యలు ప్రకటించిన నేపథ్యంలో జోగి రమేష్ అభ్యంతరం మేరకు హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. జోగి రమేశ్ పార్టీకి సంబంధించిన ర్యాలీలు, సభలు, సమావేశాల్లో మాత్రం పాల్గొనవచ్చని పేర్కొంది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.