జగన్తో సన్నిహితంగా మెలిగా: గౌరవంగా మాట్లాడి వ్యక్తిత్వాన్ని చాటిన సుజయ
అమరావతి: తెలుగుదేశం పార్టీ చేపట్టిన 'ఆపరేషన్ ఆకర్ష్'లో భాగంగా వైసీపీని వీడి ఇప్పటి వరకు 12 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. వైసీపీని వీడిన అనంతరం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన తర్వాత వైసీపీ అధినేత వైయస్ జగన్పై అందరూ చేసే ఫిర్యాదు "జగన్మోహన్ రెడ్డికి చాలా అహంభావి. ఎవరి మాట వినడు. ఎవరి సలహాలు స్వీకరించడు" అని.
కానీ మొట్టమొదటిసారి వైసీపీ వీడిన ఓ ఎమ్మెల్యే వైయస్ జగన్ గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడారు. ఆయనే బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ట రంగారావు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టిన రోజైన ఈరోజు విజయవాడలో ఆయన చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి చేరారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ "జగన్మోహన్ రెడ్డి నన్ను చాలా గౌరవంగానే చూసుకొన్నారు. ఆయనతో నేనెన్నడూ ఇబ్బంది పడలేదు. బొత్స సత్యనారాయణ కారణంగా నేను పార్టీ వీడుతున్నాననే ప్రచారం కూడా నిజం కాదు. పార్టీలో వ్యక్తుల మధ్య అభిప్రాయభేదాలు ఉండటం చాలా సహజమే. కానీ నేను ఆయనతో విభేదించి పార్టీ మారడం లేదు. జిల్లాలో వెనుకబడి ఉన్న నా నియోజకవర్గం అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నాను. పార్టీ కార్యకర్తలు కూడా నాతో ఏకీభవించిన తరువాతే పార్టీ మారుతున్నాను," అని చెప్పారు.
వైసీపీలో నాలుగేళ్ల పాటు వైయస్ జగన్తో సన్నిహితంగా మెలిగానని అన్నారు. పార్టీలో ఉన్నంత వరకు జగన్తో నాకెలాంటి ఇబ్బంది రాలేదని ఆయన చెప్పారు. వైసీపీ నుంచి బయటకు వెళ్లిన తర్వాత కూడా పార్టీ అధినేత వైయస్ జగన్ పట్ల సుజయ కృష్ట రంగారావు చాలా గౌరవంగా మాట్లాడి ఆయన వ్యక్తిత్వాన్ని అద్దం పట్టారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బొబ్బిలి రాజులు సౌమ్యులు. టీడీపీలో చేరిన అనంతరం ఆయన మాట్లాడుతూ తాము టీడీపీలో చేరడం వల్ల ఎవరికీ ఇబ్బందులు కలిగించమని కూడా చెప్పారు. జిల్లాలోని టీడీపీ నేతలందరినీ కలుపుకోని పోతామని చెప్పారు. పదవులు, ప్రలోభాల కోసం తాము రాజకీయం చేయబోమని తెలిపారు.
రాజీనామా పేరుతో రాజకీయక్రీడలో మళ్లీ బలికావడానికి సిద్ధంగా లేననని అన్నారు. సమయం వచ్చినప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. కేవలం నియోజక వర్గ అభివృద్ధి కోసమే టీడీపీలో చేరామని ఆయన స్పష్టం చేశారు.