అంతకుమించి కన్సేషన్ ఇవ్వలేం: హైదరాబాద్పై జైపాల్
న్యూఢిల్లీ: మంత్రుల బృందానికి (జివోఎం) తాము పదకొండు అంశాలపై ఓ నోట్ ఇచ్చామని, దాని వివరాలను ఇప్పుడే బయట పెట్టలేమని, హైదరాబాదును పదేళ్ల ఉమ్మడికి అంగీకరించామని, అంతకుమించి కన్సేషన్ ఇవ్వలేమని కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి సోమవారం చెప్పారు. కేంద్రం నిర్ణయాలు తీసుకునే వరకు తమ నోట్ వివరాలను చెప్పలేమన్నారు. జివోఎంతో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తాము హైదరాబాదు, భద్రాచలంతో కూడిన పది జిల్లాల తెలంగాణను కోరుకుంటున్నామని చెప్పారు.
భద్రాచలం డివిజన్ ఖమ్మం జిల్లాలో అంతర్భాగమన్నారు. తమకు సంపూర్ణ తెలంగాణ కావాలన్నారు. హైదరాబాదు పైన ఎలాంటి ఆంక్షలు విధించవద్దన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక విద్యుత్ కొరత ఏర్పడనున్న నేపథ్యంలో పాత పద్దతిని పదేళ్ల పాటు కొనసాగించాలని జివోఎంను కోరినట్లు చెప్పారు. గోదావరి నది పైన ట్రైబ్యునల్ అవసరం లేదన్నారు.
371డిని కొనసాగించాలని ఇరు ప్రాంత ఉద్యోగులు కోరుతున్నారన్నారు. దానిని సవరించాల్సిన అవసరం లేదన్నారు. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని చెప్పారు. హైదరాబాదు పైన కృత్రిమ ఆంక్షలతో ప్రయోజనం లేదని చెప్పినట్లు తెలిపారు. హైదరాబాదు నగరాన్ని పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచడమే చారిత్రాత్మక నిర్ణయమన్నారు.
దానికి తాము అంగీకరించామని, అంతకంటే పెద్ద కన్సేషన్ ఇవ్వలేమన్నారు. ఎన్నికలకు ముందే రెండు రాష్ట్రాలు ఏర్పడుతాయని, రెండు రాష్ట్రాల్లోనే ఎన్నికలు జరుగుతాయని జైపాల్ రెడ్డి చెప్పారు. హైదరాబాదు రెవెన్యూను ఇరు ప్రాంతాలకు పంపించాలనే విషయం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు.
భద్రాచలం తెలంగాణలోనే: బలరాం
భద్రాచలం డివిజన్ను తెలంగాణ నుండి వేరు చేసేందుకు గిరిజనులు ఒప్పుకోరని కేంద్రమంత్రి బలరాం నాయక్ అన్నారు. భద్రాచలం తెలంగాణలోనే ఉంటుందన్నారు.
సీమాంధ్రుల భద్రతపై మాకు బాధ్యత: సర్వే
హైదరాబాదులో, తెలంగాణలో ఉండే సీమాంధ్ర ప్రజల భద్రత బాధ్యత తమ పైన ఉందని సర్వే సత్యనారాయణ అన్నారు. దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని లేదన్నారు. అలాంటిది తాము ఉమ్మడికి అంగీకరించినట్లు చెప్పారు.