తోలు తీస్తా, దుర్మార్గుడివి: ఊగిపోయిన బాబు, నీకంత లేదు: జగన్
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టులో రూ.7వేల కోట్ల అవినీతి జరిగిందని, ఎన్టీపీసీ, కృష్ణపట్నంలో అవినీతి జరిగిందన్న వైసిపి అధ్యక్షులు జగన్ ఆరోపణల పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఊగిపోయారు. జగన్ చేసిన ఆరోపణలు నిరూపించేదాకా సభ ముందుకు కదలదన్నారు. వాటిని నిరూపించాల్సిందే అన్నారు.
చంద్రబాబు మాట్లాడుతూ... ఏం తమాషాగా ఉందా హౌస్ అంటే అని వైసిపి సభ్యులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇది పవిత్రమైన దేవాలయమని, విపక్షం చెప్పిన మాట పైన నిలబడాలన్నారు. మీ ఎమ్మెల్యేల్లో ఎవరికైనా ధైర్యం ఉంటే.. పోలవరం, విటిపిఎస్, కృష్ణపట్నంలో అవినీతి జరిగిందా నిరూపించగలరా అని సవాల్ చేశారు.
లేదంటే జగన్ పైన చర్యలు తీసుకుంటామన్నారు. వైసిపి ఎమ్మెల్యేలందరికీ నేను సవాల్ విసురుతున్నానని చెప్పారు. నిరూపించకుంటే ఈ సభకు వచ్చే అర్హత లేదన్నారు. మీది దివాళా పార్టీ అన్నారు. అసత్యాలు మాట్లాడితే ప్రజలు నమ్మరన్నారు. చెప్పిందే పదిసార్లు చెప్పడం సరికాదన్నారు.
వీళ్ల పైన అన్ని ఆరోపణలు రుజువయ్యాయన్నారు. కోర్టులో సమావేశాలు పెట్టుకునే పరిస్థితి వచ్చిందన్నారు. సిగ్గు లేకుండా అవినీతి ఆరోపణలు చేస్తారా అని ధ్వజమెత్తారు. 35 ఏళ్లుగా నీతి నిజాయితీగా బతుకుతున్నానని చెప్పారు.
తోలు తీస్తా, వదిలి పెట్టను
అయిదేళ్లలో మీరు చేసిన పనికి జీవితాంతం శిక్ష పడే పరిస్థితి వచ్చిందని జగన్ అవినీతిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వైసిపి దోపిడీ పార్టీ అన్నారు. పనికిమాలిన పార్టీ అన్నారు. ఆ విషయం గుర్తుంచుకోవాలన్నారు. రౌడీయిజం చేస్తే తోలు తీస్తామని, వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు.
తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు క్షమాపణ మాత్రం చెప్పి ఊరుకుంటే ఊరుకునేది లేదన్నారు. తప్పకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మరోసారి ఇలాగే తప్పుడు ఆరోపణలు చేసి, క్షమాపణ కోరితే ఎలా అన్నారు. ఇప్పటికే మొన్న రాజధాని భూముల పైన ఆరోపణలు చేశారన్నారు.
జగన్ చేసిన ఆరోపణలు నిరూపించకుంటే ఆయనను తప్పించి ప్రతిపక్ష నాయకుడిగా మరొకరిని ఎన్నుకోవాలన్నారు. ఆధారాలు ఉంటే నిరూపిస్తే నేను సభకు రానని, లేదంటే జగన్ సభకు రావొద్దన్నారు. ఇప్పుడు చేసిన ఆరోపణలను నిరూపించాకే ముందుకు పోదామన్నారు.
జగన్ మాట్లాడుతూ... నేను రెండు ఆరోపణలే చేశానా, 20 ఆరోపణలు చేశానని చెప్పారు. చంద్రబాబుకు దమ్ము, దైర్యం ఉంటే సిబిఐ విచారణ జరిపించాలన్నారు.
మీ నాన్న ఏం చేయలేకపోయాడు
చంద్రబాబు మాట్లాడుతూ.. మీ నాన్న వైయస్ బతికున్నప్పుడు నా పైన కోర్టుకు వెళ్లారని, 23 ఎంక్వయిరీలు వేశారని, ఏం చేయలేకపోయాడన్నారు. ఈ సందర్భంగా.. వైయస్ అనుకూలురు చేసిన అభియోగాలపై కోర్టు పెట్టిన చివాట్లను చంద్రబాబు సభలో ప్రస్తావించారు.
జగన్ 26 కేసులు పెట్టినా భయపడనన్నారు. నీలాంటి దుర్మార్గుడిని చిత్తు ఓడించి, ప్రజలు తనను గెలిపించారన్నారు. తమ పైన తప్పుడు ఆరోపణలు చేసిన మీ పేపర్ పైనాకేసులు పెడతామన్నారు. తన పైన చేసిన ఆరోపణలు ప్రూవ్ చేయకుంటే సభ ముందుకు వెళ్లేదే లేదన్నారు.
అవినీతి నీ జీవితం అని, నీ జీవితంలో భాగమని జగన్ పైన దుమ్మెత్తి పోశారు. అవినీతి విషయంలో చండశాసనుడిని అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఒక్క ప్రాజెక్టు పూర్తిగా కట్టలేదన్నారు. తప్పు చేశామని నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమన్నారు.
జగన్ మాట్లాడుతూ.. తాను 20 ఆరోపణలు చేశానని, వీటిపై సిబిఐ విచారణకు దమ్ము ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఆ దమ్మూ ధైర్యం లేదని అందరికీ తెలుసన్నారు. చంద్రబాబు, జగన్ వాగ్వాదం సమయంలో సభలో గందరగోళం ఏర్పడింది. దీంతో సభను స్పీకర్ పది నిమిషాలు వాయిదా వేశారు.