13జిల్లాల ఆంధ్రుల ఆవేదన 13 నిమిషాలేనా?: బెజవాడలో టీడీపీ ఫ్లెక్సీలు
విజయవాడ: పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం జరుగుతున్న సమయంలో విజయవాడలో తెలుగుదేశం పార్టీ నేత పేరుతో ఓ ఫ్లెక్సీ వెలిసింది. 13 జిల్లాల ఏపీ ప్రజల ఆవేదన వినిపించేందుకు 13 నిమిషాల సమయమే కేటాయిస్తారా అని ప్రశ్నించారు.
అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా టీడీపీకి 13 నిమిషాల సమయం కేటాయించారు. ఆయా పార్టీల ఎంపీల సభ్యుల ఆధారంగా ఈ సమయాన్ని కేటాయిస్తారు. ఇది రూల్. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ అలాగే కేటాయించింది. కానీ దీనిని టీడీపీ నేతలు తప్పుబట్టడం గమనార్హం.
దీనిని నిరసిస్తూ విజయవాడలో ఫ్లెక్సీలు వెలిశాయి. 13 జిల్లాల రాష్ట్ర ప్రజల ఆవేదన వినిపించేందుకు 13 నిమిషాల సమయం ఎలా సరిపోతుందని ప్రశ్నించారు. ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీని నరేంద్ర మోడీ మరిపిస్తున్నారని పేర్కొన్నారు.
రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్కు పట్టిన గతే వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీకి పడుతుందని హెచ్చరించారు. స్థానిక టీడీపీ నేత కాట్రగడ్డ బాబు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కేంద్రం విధానాలపై గత మూడు నెలలుగా కాట్రగడ్డ బాబు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తన నిరసన తెలుపుతున్నారు.