సభలో 'మగాడు' సవాల్: తీవ్ర వ్యాఖ్యలు, దమ్ముంటే రా: జగన్కు బాబు
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు, సోలార్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని వైసిపి అధినేత జగన్ ఆరోపించారు. దీనిపై మంత్రులు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు ప్రతిపక్ష నేత పైన తీవ్రంగా స్పందించారు. జగన్ పైన మండిపడ్డారు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై వైసిపి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ప్రాజెక్టులపై జగన్ మాట్లాడుతూ.. పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు తగ్గుతున్నప్పటికీ కాంట్రాక్టర్లకు ధరలు పెంచుకునేందుకు అవకాశమిచ్చారని మండిపడ్డారు. జీవో నెంబర్లు 62, 63 ద్వారా కొంతమంది కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చుతున్నారన్నారు. రాజధాని భూసేకరణ పేరిట అన్యాయం చేస్తున్నారన్నారు. రాజధాని పేరిట భూదందా సరికాదన్నారు.
మంత్రి దేవినేని మాట్లాడుతూ... వైయస్ రాజశేఖర రెడ్డి 2004లో జలయజ్ఞం, ధనయజ్ఞం మొదలు పెట్టారన్నారు. బెంగళూరులో కట్టిన 30 ఎకరాల భవనం దోచుకున్నదే అని ధ్వజమెత్తారు. మేం పారదర్శకంగా ఆన్ లైన్ టెండర్లు పిలిచామన్నారు.
జగన్ బుద్ధి లేకుండా, సిగ్గు లేకుండా, బాధ్యత లేకుండా ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఖబడ్దార్ జగన్ అని హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు తాము కృషి చేస్తున్నామన్నారు. దేవినేని హెచ్చరికపై వైసిపి నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
అనంతరం జగన్ మాట్లాడుతూ... లంచాలు తీసుకొని కాంట్రాక్టులు ఇస్తున్నారన్నారు. గోదావరి పుష్కరాలు మనమంతా చూశామన్నారు. నాసిరకం పనులకు రూ.1650 కోట్లు ఖర్చు చేశారన్నారు. రెండేళ్లలో ఎన్నో స్కాంలు జరుగుతున్నా కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరేలా జీవోలు విడుదలచేస్తున్నారన్నారు. పోలవరం నాసిరకంగా సాగుతున్నాయన్నారు. రెండేళ్లుగా ఇసుకును బాగా తిని, ఇప్పుడు ఉచితంగా అంటున్నారన్నారు.
సోలార్ స్కాం అందరూ చూశామన్నారు. ఇది రూ.750 కోట్ల స్కాం అన్నారు. తెలంగాణలో, గుజరాత్లో 4.4 కోట్లు పర్ మెగావాట్ ఉంటే, ఏపీలో మాత్రం రూ.5.82 కోట్లుగా ఉందని విమర్శించారు.
ఏపీలో దోచుకున్న డబ్బును తెలంగాణలో ఇస్తుంటే వీడియో, ఆడియో టేపులతో చంద్రబాబు దొరికిపోయాడని జగన్ ఓటుకు నోటు కేసును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్నారు.
మగాడివైతే: జగన్ వర్సెస్ అచ్చెన్నాయుడు
మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. జగన్కు ఓ సవాల్ చేస్తే నిలబడే ధైర్యం కూడా లేదన్నారు. మొన్న రాజధాని భూముల విషయమై పత్తిపాటి పుల్లారావు, నారాయణల పైన ఆరోపించారని, వాటిని నిరూపించమంటే పారిపోయాడన్నారు. వైయస్ హయాంలో వ్యవస్థలను భ్రష్టు పట్టించారన్నారు.
ఎన్టీపీసీ, సోలార్ తదితరాల వాటిలో అవినీతి జరుగుతోందని జగన్ చెబుతున్నారని, జగన్ మగాడైతే, రాయలసీమ రక్తం ఆయనలో ఉంటే వాటిని నిరూపించాలన్నారు. ఇప్పటి వరకు అగ్రిమెంట్ లేని విషయంలోను అవినీతి అనడం విడ్డూరమన్నారు.
నేను అనవద్దని, కానీ అనక తప్పడం లేదని జగన్కు మగతనం ఉంటే పోలవరం, తదితర వాటిల్లో స్కాం జరిగిందని నిరూపించాలన్నారు. లేదంటే రాజకీయాల నుంచి తప్పుకోవాలన్నారు. వాటిని నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. పోలవరం ప్రాజెక్టులో తప్పు నిరూపించకుంటే చెంపలు వేసుకొని జగన్ రాజకీయాల నుంచి తప్పుకోవాలన్నారు.
జగన్ మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ఉండి కూడా మగాడిలా సోనియా గాంధీతో ఎవరు పోరాడారో అందరికీ తెలుసునని చెప్పారు. సోలార్ కుంభకోణం కోర్టు పరిధిలో ఉందన్నారు. సోలార్ కుంభకోణంలో ఏడు కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు.
నిన్న పారిపోయావ్, నిరూపించు: చంద్రబాబు సవాల్
చంద్రబాబు మాట్లాడుతూ... సభలో ఓ సంప్రదాయం లేదని, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అన్నారు. వందల కోట్ల రూపాయల ఆరోపణలు జగన్ చేశారని, వాటిని నిరూపించాలన్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఏం మాట్లాడాలో తెలియడం లేదన్నారు.
పన్నెండు కేసుల్లో దోషి అన్నారు. ఈడీ వెబ్ సైట్ చూస్తే ఆయన పైన ఉన్న కేసులన్నీ తెలుస్తాయన్నారు. జెన్కో, ఎన్టీపీసీ తదితర విషయాల పైన జగన్ ఆరోపణలు సరికాదన్నారు. తమ పైన చేసిన ఆరోపణలు నిరూపిస్తే సంబంధితులపై చర్యలు తీసుకునేందుకు నేను సిద్ధమన్నారు.
రాజధాని భూమి విషయంలో మంత్రులు నారాయణ, పత్తిపాటి పుల్లారావుల పైన ఆరోపణలు చేశారని, వాటిని నిరూపించమంటే పారిపోయారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇప్పుడు విద్యుత్ విషయంలో తమ పైన చేసిన ఆరోపణలకు తన సవాల్కు ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు.
ఏడువేల కోట్ల అవినీతి జరిగిందని ఓ వైపు ఆరోపించారని, నిరూపించమని చెబితే వెనక్కి పోతున్నారని ధ్వజమెత్తారు. అబద్దాలు మాట్లాడేందుకు సిగ్గుందా అని ప్రశ్నించారు.
సోలార్ వ్యవహారం పూర్తయిందని జగన్ సభలో చెప్పారని, కానీ ఇంకా ఇవ్వలేదని, దానిని నిరూపించాలని చంద్రబాబు ధ్వజమెత్తారు. 'ఇవ్వలేదు' అంటూ చంద్రబాబు నొక్కి చెప్పారు. ప్రతిపక్ష సభ్యులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని, సిగ్గులేకుండా మాట్లాడుతున్నారన్నారు.
సోలార్ కుంభకోణంలో రూ.7 కోట్ల అవినీతి జరిగితే నిరూపించాలని, లేదంటే అప్పటి వరకు సభ ముందుకు జరగనివ్వవద్దన్నారు. రాజధాని కడుతుంటే దానిని అడ్డుకునేందుకు కోర్టులకు వెళ్తారని మండిపడ్డారు. ముందు
ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం, ఆ తర్వాత పారిపోవడం జగన్ వైఖరి అన్నారు. ఆరోపణలు నిరూపిస్తే నేను సభకు రానని, నిరూపించకుంటే జగన్ ఆ పని చేయగలరా అని సవాల్ చేశారు. మీకు ధైర్యం ఉంటే నా సవాల్కు ముందుకు రావాలన్నారు. ఆరోపణలు నిరూపించకుంటే జగన్ పైన చర్యలు తీసుకోవాలన్నారు. వీటీపీఎస్, కృష్ణపట్నంలపై వైసిపివి అసత్య ఆరోపణలన్నారు. వాటిని నిరూపించాలన్నారు.
బిజెపి సభ్యుడు విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ... జగన్ ఆరోపణలు చేసినప్పుడు చంద్రబాబు స్పందించారని, ఆయన సవాల్కు స్పందించాలన్నారు. ఆరోపణలు చేసినప్పుడు సాక్షాలు లేకుండా చేస్తే సరికాదన్నారు.
టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.. స్కాంల స్వామీ విమర్శలు చేయడం విడ్డూరమన్నారు.
అవినీతి అస్సలూ జరగలేదు: జగన్ ఎద్దేవా
జగన్ మాట్లాడుతూ.. కోర్టులో ఉంది అంటే అది ప్రాసెస్ జరిగినట్లే కాదా అన్నారు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల్లో అస్సలూ అవినీతి జరగలేదని ఎద్దేవా చేశారు.
జగన్ మాట్లాడుతుంటే నిలిచిన ప్రత్యక్ష ప్రసారం
ఓ సమయంలో జగన్ మాట్లాడుతున్న సమయంలో అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారం ఆగిపోయింది. సాంకేతిక కారణాల కారణంగా లైవ్ నిలిచిపోయినట్లుగా తెలుస్తోంది. కాగా, ఓటుకు నోటు అని జగన్ చెప్పగానే ఆయన మైక్ కట్ చేశారని సాక్షిలో వచ్చింది.