అవిశ్వాసానికి ఓకే కానీ బాబుకు ఊహించని షాక్: జేసీ సంచలన నిర్ణయం, ఎంపీ పదవికి రిజైన్!
అనంతపురం: తెలుగుదేశం పార్టీ అనంతపురం జేసీ దివాకర్ రెడ్డి గురువారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేపు (శుక్రవారం) అవిశ్వాస తీర్మానంపై చర్చ పూర్తయ్యాక తాను తన లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ఆయన ప్రకటన చేశారు.
బాబు వ్యూహమే: కేశినేని, టీడీపీకి టీఆర్ఎస్ షాక్.. ఎవరిని అడిగి అవిశ్వాసం పెట్టారు
పార్టీలో తనకు ప్రాధాన్యం దక్కడం లేదనడంతో పాటు పలు కారణాలతో జేసీ పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తాను అవిశ్వాస తీర్మానానికి హాజరుకాబోనని బుధవారం ప్రకటించారు. దీంతో టీడీపీలో కలకలం ప్రారంభమైంది. ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేశారు.
చంద్రబాబు ఎమ్మెల్యేను పిలిపించి
ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో విభేదాలు కూడా అసంతృప్తికి కారణంగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ ఎమ్మెల్యేను చంద్రబాబు పిలిపించి మాట్లాడారు. అనంతరం ఆయన జేసీతో తనకు విభేదాలు లేవని స్పష్టం చేశారు. ఆ తర్వాత అనంతపురం రోడ్డు వైండింగ్ పనులకు ప్రభుత్వం కూడా రూ.45 కోట్లకు పైగా నిధులను విడుదల చేస్తూ జీవో విడుదల చేసింది.
కథ సుఖాంతమయిందనుకున్న సమయంలో..
దీంతో చంద్రబాబుపై ఆయన తన పంతం నెగ్గించుకున్నారు. అభివృద్ధి పనులకు నిధులకు జీవో రావడంతో ఆయన రేపటి అవిశ్వాస తీర్మానం చర్చలో పాల్గొని, అధిష్టానంకు అనుగుణంగా ఓటు వేస్తారని భావించారు. దీంతో కథ సుఖాంతమైందనుకున్నారు.
జేసీ అనూహ్య నిర్ణయం
కానీ పంతం నెగ్గించుకున్న జేసీ ఆ తర్వాత అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అవిశ్వాస తీర్మానం చర్చ, ఓటింగులో పాల్గొంటానని చెప్పారు. కానీ ఆ తర్వాత తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. అందుకు ఆయన కారణాలు కూడా చెప్పారు.
ప్రభాకర్కు ఇచ్చిన ప్రాధాన్యత ఇవ్వట్లేదు
పార్టీకి చెందిన ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి ఇచ్చినంత ప్రాధాన్యత కూడా ఇవ్వడం లేదని జేసీ దివాకర్ రెడ్డి వాపోతున్నారు. అనంతపురం జిల్లా అభివృద్ధిపై తనకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని చెప్పారు. ఈ కారణాలతో తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారని తెలుస్తోంది. కాగా, రాజీనామాపై కూడా జేసీని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు.