క్యాసెట్ ఇస్తే చాలు: యనమలకు దొరికిన జగన్, ఒప్పుకున్నందుకు టిడిపి హ్యాపీ
హైదరాబాద్: అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో చర్చ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుండగా.. అధికార టిడిపి నేతలు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడులు జగన్ పైన వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చారని, వాటిని నెరవేర్చడం లేదని జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళల రుణాలు, రైతు రుణాలు, ఇంటికో ఉద్యోగం, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు తదితర విషయాలపై మాట్లాడారు. దీనిపై యనమల, అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు.
జగన్ ఎప్పటి స్క్రిప్ట్నో ఇప్పుడు తీసుకు వచ్చి చదువుతున్నారని మంత్రులు యనమల, అచ్చెన్నాయుడు విమర్శించారు.
యనమల మాట్లాడుతూ.. జగన్ ఆ స్పీచ్ను ఇప్పుడు రాసుకున్నారా, గతంలో రాసుకున్నారా చెప్పాలన్నారు. ఆయన రెండేళ్లుగా ఇదే చదువుతున్నారని ఎద్దేవా చేశారు. ఎప్పుడో రాసిచ్చిన స్క్పిప్ట్ను అతను చదువుతున్నాడన్నారు.
అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. జగన్ మొదటి అసెంబ్లీలో మాట్లాడిన క్యాసెట్లు ఇప్పుడు ఇస్తే ఆయన మళ్లీ మాట్లాడాల్సిన అవసరం లేదని సెటైర్ వేశారు. ఎప్పుడు ఒకటే మాట్లాడుతున్నారన్నారు.
అంతకుముందు కూడా యనమల చురకలు అంటించారు. తమ పార్టీ నుంచి గెలిచి, వైసిపిలో చేరిన 8 మంది ఎమ్మెల్యేలను డిస్ క్వాలిఫై చేయించేందుకే తాను అవిశ్వాస తీర్మానం పెట్టానని జగన్ చెప్పారు.
జగన్ మాట్లాడుతూ.. టిడిపిలో చేరిన తమ పార్టీ ఎమ్మెల్యేలు ఇక్కడకు రాకపోయినా, చంద్రబాబుకు వ్యతిరేకంగా ఓటు వేయకపోయినా డిస్ క్వాలిఫై చేయాలని చెప్పారు. అందుకే అవిశ్వాస తీర్మానం పెట్టామన్నారు.
దీనిపై యనమల మాట్లాడుతూ.. మా ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకే (టిడిపిలో చేరిన వైసిపి ఎమ్మెల్యేలు) అవిశ్వాసం పెట్టామని జగన్ వాస్తవాన్ని అంగీకరించారని, ఇది సంతోషకరమన్నారు. తద్వారా మీ పార్టీ ఎమ్మెల్యేలకే మీకు విశ్వాసం లేదని తేల్చారన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేల విశ్వాసమే జగన్ పొందలేకపోయారన్నారు.
అంతకుముందు, జగన్ ఆరోపణల పైన అచ్చెన్నాయుడు తీవ్రంగా స్పందించారు. జగన్ తన స్వార్థంతో రాష్ట్రాన్ని తగలబెట్టాలని చూస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేపడితే చాలు దానికి అడ్డుతగలడం జగన్కు అలవాటైందన్నారు.
రాష్ట్రాభివృద్ధికి మంచి సలహాలు, సూచనలు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. కష్టాల్లో రాష్ట్రాన్ని దాని నుంచి బయటపడేయాలని చూస్తుంటే ప్రతిపక్షాలు తమపై అభాండాలు వేయడం సబబు కాదన్నారు. ఇళ్ల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్కు లేదన్నారు.
ఇళ్ల నిర్మాణంలో కాంగ్రెస్ భారీ అవినీతికి పాల్పడిందని, 43 లక్షల ఇళ్లల్లో 15 లక్షల ఇళ్లను తమ కార్యకర్తలకే వారు కట్టబెట్టారని ఆరోపించారు. మొదటి ఏపీ అసెంబ్లీలో ఏవైతే మాట్లాడారో అవే విషయాలను జగన్ ప్రతిసారి మాట్లాడుతున్నారని, ఒకటే స్పీచ్ రిపీట్ చేస్తున్నాడన్నారు.