జగన్ సంతకం: 'అవిశ్వాసం'పై యనమల మెలిక, టిడిపిలో చేరిన వారు డుమ్మా
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం పైన ఏపీ శాసన సభలో సోమవారం మధ్యాహ్నం చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ... అసలు అవిశ్వాస తీర్మానం నోటీసు పైన జగన్ ఎందుకు సంతకం చేయలేదని ప్రశ్నించారు.
కాగా, అవిశ్వాస తీర్మాన చర్చకు టిడిపిలో చేరిన వైసిపి ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కాస్తంత రిలాక్స్డ్గా, ఉల్లాసంగా కనిపించారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభలో లేని చంద్రబాబు... అవిశ్వాసంపై చర్చకు అందిరితో పాటు సభలోకి వచ్చారు.
చర్చ ఎలా నిర్వహించాలన్న విషయంపై జగన్, వైసిపి ఉపనేత జ్యోతు నెహ్రూ... సభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, బిజెఎల్పీ నేత విష్ణుకుమార్ రాజుల మధ్య జరిగిన వాద ప్రతివాదనలను వింటూ చంద్రబాబు ముసిముసిగా నవ్వులు చిందించారు.
అవిశ్వాస తీర్మానం పైన చర్చ సందర్భంగా మాట్లాడేందుకు ప్రిపేర్ అయి రాలేదంటూ బిజెపి సభ్యులు విష్ణు కుమార్ రాజు చెబుతూ... విపక్షం (వైసిపి) వైపు చేతులు చూపారు. ఈ వ్యంగ్యాస్త్రానికి చంద్రబాబు ముసిముసిగా నవ్వారు.
చర్చ ప్రారంభం కాగానే తీర్మానంపై సంతకాలు పెట్టిన సభ్యులే చర్చలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని సభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు కొత్త అంశాన్ని ప్రస్తావించారు. ఆ తర్వాత మాట్లాడిన జ్యోతుల నెహ్రూ, విష్ణుకుమార్ రాజు అభ్యర్థనతో సంతకాలు పెట్టిన సభ్యులకే కాకుండా మిగిలిన సభ్యులకూ చర్చలో అవకాశం కల్పించేందుకు అధికారపక్షం సుముఖత వ్యక్తం చేసింది.
అయితే విపక్షానికి చెందిన ఒక సభ్యుడు మాట్లాడితే... తమ పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులకు మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని యనమల కొత్త మెలిక పెట్టారు. ఈ విషయాన్ని ఆయన పదేపదే వల్లె వేశారు. ఈ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి.
జగన్పై అవిశ్వాసం లేకే: శ్రవణ్ కుమార్
వైసిపి అధినేత జగన్ పైన ఆ పార్టీ ఎమ్మెల్యేలకు విశ్వాసం లేదని, అందుకే తమ ప్రభుత్వంపై జగన్ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారని టిడిపి ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ అన్నారు. అవిశ్వాసం ఎందుకు ప్రవేశ పెట్టారో స్పష్టం చేయాలన్నారు. పోలవరం సాకారం చేస్తున్నందుకు అవిశ్వాసం పెట్టారా అని ప్రశ్నించారు.
అవిశ్వాస తీర్మానం పైన జగన్కు అవగాహన లేదన్నారు. జగన్ పైన విశ్వాసం లేకే ఆ పార్టీ ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతున్నారన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షాల నుంచి నిర్మాణాత్మక సహకారం లేదన్నారు. అవిశ్వాస తీర్మానాన్ని మనస్ఫూర్తిగా తాను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు.
నదుల అనుసంధానం చేసినందుకు అవిశ్వాస తీర్మానం పెట్టారా అని ప్రశ్నించారు. మొదటి నుంచి రాజధాని అమరావతికి జగన్ వ్యతిరేకి అని ధ్వజమెత్తారు. ప్రభుత్వం పైన వైసిపికి చెందిన సాక్షి పత్రిక విషపు రాతలు రాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.