సీనియర్లు, జూనియర్లని తేడా లేదు..! టీడిపిలో తమ్ముళ్లందరి లక్ష్యం అదేనా..?
అమరావతి/హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీలో కుదుపులు కొనసాగుతూనే ఉన్నాయి. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా నేతలు పార్టీ మారేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. విశాఖ జిల్లా నర్సీనట్నం టీడీపీ నాయకులు నైరాశ్యంలో కూరుకుపోయినట్టు వార్తలు ఘుప్పుమంటున్నాయి. ఎన్నికల్లో ఓటమి తరువాత, తమకు దిశానిర్ధేశం చేసేవారు కూడా కరువయ్యారనే భావన తెలుగు తమ్ముళ్లను కృంగ దీస్తుందనే చర్చ జోరుగా నడుస్తోంది.
నర్సీపట్నంలో 1978 నుంచి ఇప్పటి వరకు 11 సార్లు ఎన్నికలు జరిగాయి. మొత్తంగా ఏడుసార్లు తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించింది. కాంగ్రెస్ మూడు సార్లు విజయం సాధిందింది. తాజా ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ పునాది వేసుకుంది. దీనికి ప్రధానంగా టీడీపీలో ఉన్న కీలక నాయకుల పసలేని వ్యవహారాలే కారణమనే వ్యాఖ్యలు తమ్ముళ్లలో జోరుగా వినిపిస్తున్నాయి. అందుకే ఆ సీనియర్ నేత పార్టీ వీడేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్టు చర్చ జరుగుతోంది.
టీడిపి కి చెక్ చెప్పనున్న విశాఖ ప్రాంత సీనియర్ నేత..! కారణం అదేనా..?
విశాఖ చేరువలోని నర్సీపట్నం నియోజకవర్గం నుంచి చింతకాయల అయ్యన్న పాత్రుడు టీడీపీ తరపున ఎక్కువ సార్లు పోటీ చేసి విజయం సాధించారు. చంద్రబాబు కేబినెట్ లోనూ ఆయన మంత్రిగా చక్రం తిప్పారు. అయితే ఆయన పార్టీని బలోపేతం చేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టకపోవడంతోనే ఇప్పుడు కేరాఫ్ లేకుండా పోయిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరపున బరిలో నిలిచిన సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ సోదరుడు ఉమా శంకర్ గణేష్ విజయం సాధించారు.
అతి ఆత్మ విశ్వాసం..! టీడిపి నేతల కొంప ముంచింది.!!
నిజానికి ఇక్కడ టీడీపీ గెలిచి ఉండేదే. అయితే స్వయంకృత అపరాథం - నాయకుల మధ్య పొరపొచ్చాలు సిట్టింగ్ ఎమ్మెల్యే కమ్ మంత్రి ఆయ్యన్న ఇక - తాను పోటీ నుంచి తప్పుకొంటున్నామని ఎన్నికలకు ముందుగానే ప్రచారం చేయడం - కుటుంబంలో సోదరుడు ప్రత్యేక వర్గంగా మారిపోయి ప్రచారానికి దూరంగా ఉండడం వంటి కారణాలు పార్టీని నిలువునా ఇబ్బంది పెట్టాయని అంటున్నారు పరిశీలకులు. మరోపక్క పార్టీ తరపున బలోపేతమైన కార్యక్రమాలు చేయడంలోను - పార్టీని సభ్యత్వ నమోదులో దూసుకుపోయే విషయంలోనూ అయ్యన్న చేష్టలుడిగి వ్యవహరించారనే వ్యాఖ్యలు వినిపించాయి.
నేతల మద్య మనస్పర్థలు..! సొంత నేతల మద్య యుద్ద వాతావరణం..!!
తన కుమారుడికి టికెట్ ఇప్పించుకోవాలనే ప్రయత్నంలో ఆయన నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టలేకపోయారు. అయితే దీనిని విభేదించిన అయ్యన్న సోదరుడు సొంతగా ఓ వర్గం ఏర్పాటు చేసుకున్నారు. ఇక కాంగ్రెస్ తరపున 2009లో ఇక్కడ గెలిచిన బోళెం ముత్యాల పాప తర్వాత కాలంలో టీడీపీలోకి వచ్చారు. అయితే ఆమె ఎదుగుదల తనకు ఇబ్బందేనని భావించిన అయ్యన్నఆమెకు పొగబెట్టారు. దీంతో ఆమె తటస్థంగా మారిపోయారు. ఈ నేపథ్యంలో ఆమె బలం లేక పోతే.. తాను గెలవడం కష్టమని భావించిన అయ్యన్న చివరకు ఇంటికి వెళ్లి మరీ స్వయంగా ఆహ్యానించి ఎన్నికల సమయంలో మద్దతు కోరారు.
అయ్యన్న పాత్రుడి అలక..! పార్టీ వీడేందుకు రంగం సిద్దం చేసుకుంటున్న సీనియర్ నేత..!!
ఆమె పార్టీలోకి వచ్చినా.. ఎన్నికల వేళకు మాత్రం మనసు మార్చుకున్నారు. అయ్యన్నకు వ్యతిరేకంగా చాపకింద నీరులా వైసీపీ అనుకూలంగా పనిచేశారు. ఇక సొంత పార్టీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై బహిరంగ అవినీతి ఆరోపణలు చేసి పార్టీ పరువును బజారుకు ఈడ్చారు అయ్యన్న. దీంతో మొత్తంగా ఇక్కడ తుడిచి పెట్టుకుపోయింది. పైగా ఇటీవల జరిగిన ఎన్నికల్లోనే తనకు ఇంట్రస్ట్ లేదని చెప్పిన అయ్యన్న వచ్చే ఎన్నికల నాటికి పోటీ చేసే అవకాశం కూడా లేదు. ఇక పార్టీ ఓడిపోయిన నేపథ్యంలో ముత్యాల పాప కూడా త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంటున్నారు. అయ్యన్న రాజకీయ సన్యాసం ఖరారైన నేపథ్యంలో ఇక్కడ టీడీపీని నడిపించేందుకు నాయకుడు కావలెను! అంటున్నారు తమ్ముళ్లు. మరి జరుగుతున్న పరిణామాల పట్ల చంద్రబాబు ఏలా స్పందిస్తారో చూడాలి.