కేసీఆర్..కేంద్రం మధ్యలో జగన్ : కళ్లు మండేదెవరికి...: ఏపీ సీఎం అసలు టార్గెట్ అదే..!
తెలుగు రాష్ట్రాల మధ్య మొదలైన తాజా వాటర్ వార్..కొత్త పొలిటికల్ ఈక్వేషన్స్ కు కారణమవుతోంది. ఇద్దరు ముఖ్యమంత్రుల పైన ప్రతిపక్షాలు విమర్శిస్తుంటే..ఇక ఇద్దరి మైత్రికి బీటలు వారాయనే ప్రచారం మొదలైంది. ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి జగన్ తో తమ సఖ్యత కొనసాగుతుందని స్పష్టం చేసారు. ఎవరికి కళ్లు మండుతున్నాయని ప్రశ్నించారు. అయితే, జగన్ తమ వాటాకు వచ్చే నీటిలో భాగం మాత్రమే వినియోగించుకుంటున్నామని..దీని కారణంగా ఎవరికీ నష్టం చేయటం లేదని చెప్పుకొచ్చారు.
కాలికేస్తే మెడకు, మెడకేస్తే కాలికి- కేసీఆర్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న జగన్- నెక్స్ట్ టార్గెట్ అదే
ఏపీ పైన క్రిష్ణా రివర్ బోర్డుకు తెలంగాణ నేతలు ఫిర్యాదు చేసారు. తాజాగా..ఏపీ సైతం అటు క్రిష్ణా రివర్ బోర్డుతో పాటుగా..కాళేశ్వరం ప్రాజెక్టు పైనా గోదావరి బోర్డుకు ఏపీ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో..ఇప్పుడు అంత సఖ్యతగా మెలిగిన ఇద్దరు ముఖ్యమంత్రుల నడుమ ఏం జరుగుతోంది.. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి..ఏపీ సీఎం అసలు లక్ష్యం ఏంటి...రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్..
కళ్లు మండేదెవరికి..కేసీఆర్ వ్యాఖ్యల పరమార్దం
కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్ర ప్రభత్వాల మధ్య జలవివాదం తారా స్థాయికి చేరుకుంది. ఏపీ ప్రభుత్వం 203 జీవో జారీ చేయడంతో తెలంగాణలో మంత్రుల నుంచి ప్రతిపక్షనేతలు ఇతర పార్టీలు ప్రజా సంఘాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 203తో దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందని నిప్పులు చెరిగారు. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం తాము ఎవరికీ అన్యాయం చేయడం లేదనే వాదన వినిపిస్తోంది. ఇక తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేయడం అదే సమయంలో గోదావరి బోర్డుకు ఏపీ ఫిర్యాదు చేయడం అన్ని చకచకా జరిగిపోయాయి. అయితే సోమవారం సాయంత్రం తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్లో చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్తో తన మైత్రి కొనసాగుతుందనే సంకేతాలు స్పష్టంగా పంపారు. ఇదే సమయంలో ఎవరికైనా కళ్లు మండు తున్నాయా అంటూ ప్రశ్నించారు. కేంద్రం పైన ఫైర్ అవుతూనే..పొరుగు రాష్ట్ర సీఎంతో తాను సాన్నిహిత్యం కోరుకుంటున్నానని చెప్పటం ద్వారా కేసీఆర్ రాజకీయంగా వ్యూహాత్మకంగానే పావులు కదుపుతున్నార నే విశ్లేషణలు మొదలయ్యాయి. ఢిల్లీ నేతలా..లేక తమ ఇద్దరి ఉమ్మడి రాజకీయ ప్రత్యర్ధులను ఉద్దేశించి కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేసారా అనే చర్చ మొదలైంది.
కేంద్రం..కేసీఆర్ మధ్యలో జగన్
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు 2019 ఎన్నికల నాటి నుండి సఖ్యతగానే ఉంటున్నారు. రెండు రాష్ట్రాలకు సంబంధించి ఏ సమస్య వచ్చినా తామిద్దరమే పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. బేసిన్లు.. బేషజాలు ఉండవని తాజాగా కేసీఆర్ మరోసారి సైతం స్పష్టం చేసారు. అయితే, కేసీఆర్ ప్రధాని మోడీ పైన వ్యక్తిగతంగా అభిమానం చూపిస్తూనే..విధాన పరంగా కేంద్రం తీసుకొనే నిర్ణయాలను మాత్రం తప్పు పడుతున్నారు. కేంద్రం తీసుకువస్తున్న కొత్త విద్యుత్ పాలసీ..తాజాగా కేంద్రం కరోనా ప్యాకేజీ పైన కేసీఆర్ నిర్మొహమాటంగా తప్పు బట్టారు. అయితే, జగన్ తీరు మాత్రం ఇందులో భిన్నంగా ఉంది. కేంద్రం పైన జగన్ ఏ పరిస్థితుల్లోనూ వ్యతిరేక వ్యాఖ్యలు చేయటం లేదు. కేంద్రంతో సఖ్యత కొనసాగిస్తున్నారు. తెలంగాణలో బలపడాలని చూస్తున్న బీజేపీకి ఇప్పుడు అక్కడ కేసీఆర్ ప్రధాన రాజకీయ ప్రత్యర్ధి గా ఉన్నారు. కేంద్రం పైన విమర్శలు ఎక్కుపెడుతున్న కేసీఆర్ వారికి కొరకరాని కొయ్యిగా మారారు. కేంద్రం మూడ్ గమనించిన తరువాతనే ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రతిపాదించిన తెలంగాణ నుండి సీమ వరకు గోదావరి జలాల మళ్లింపు ప్రతిపాదన నుండి జగన్ తప్పుకున్నారనే ప్రచారం సాగింది. ఇక, ఇప్పుడు పోతిరెడ్డి పాడు పైన తీసుకున్న నిర్ణయం ద్వారా ఇద్దరు ముఖ్యమంత్రుల స్నేహం కొనసాగింపు పైన చర్చ మొదలైంది. అయితే, ఇద్దరూ మాత్రం తమ అవసరాల పేరుతో కేంద్రానికి అవకాశం ఇచ్చేందుకు సిద్దంగా లేరు.
సీఎం జగన్ మౌనం వెనుక అసలు లక్ష్యం...
ఇదే సమయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మౌనంగా ఉంటున్నారు. అధికారులు మాత్రం తమ పని తాము చేసుకుపోతున్నారు. తెలంగాణకు ధీటుగా ఆ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల పైన ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే, జగన్ తెలంగాణ ముఖ్యమంత్రితో స్నేహం కొనసాగాలని కోరుకుంటున్నారు. అదే సమయంలో కేంద్రం మూడ్ కు అనుగుణంగా..ఇటు ఏపీ ప్రయోజనాలు..ఇక..ఏపీలో రాజకీయ లెక్కలు తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పోతిరెడ్డిపాడు వ్యవహారంలో చంద్రబాబు ఏం మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. ఇక, తాజాగా కేసీఆర్ సైతం చంద్రబాబును పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో ఫిక్స్ చేసారు. అయితే, కేసీఆర్ తాను జగన్ తో సఖ్యతతోనే ఉంటానని చెప్పిన సమయంలోనే..కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసిన విషయం బయటకు వచ్చింది.
Recommended Video
రాజకీయ ప్రత్యర్థులను ఫిక్స్ చేస్తున్నారా..?
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్ ను సైతం ఆహ్వానించి కేసీఆర్ ముందస్తు ఆలోచనలతో జగన్ ను ఫిక్స్ చేసేసారు. అయితే తనకు కేసీఆర్కు మధ్య సంబంధాలు చెరిగిపోవాలని అదే సమయంలో బీజేపీతో పరోక్ష సంబంధాలకు కూడా జగన్ కటీఫ్ చెప్పాలని చంద్రబాబు కోరుకుంటున్న నేపథ్యంలో జగన్ తనదైన మార్కు రాజకీయం చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎవరితోనూ సంబంధాలు తెంచుకోకుండా అదే సమయంలో ఏపీ ప్రయోజనాల విషయంలో రాజీ పడటం లేదనే సంకేతాలిచ్చేందుకే తెలంగాణ ప్రాజెక్టుల పైన ఫిర్యాదులు చేసినట్లుగా స్పష్టమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, ఈ ఫిర్యాదుల పైన రివర్ బోర్డులు తేల్చేది ఏమీ ఉండదని..చివరకు ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని మాత్రమే పరిష్కారాలు చూసుకోవాల్సి ఉంటుందని..ఈ లోగా రాజకీయ ప్రత్యర్ధులను మాత్రం ఫిక్స్ చేయటం ఖాయమని విశ్లేషకుల వాదన. దీంతో..రానున్న రోజుల్లో ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల వ్యవహారం ఎటు వంటి మలుపులు తిరుగుతుందో..ఢిల్లీ పెద్దలు ఏం చేస్తారో వేచి చూడాల్సిందే.