కెసిఆర్తో విభేదాల్లేవు, కలిసి పనిచేస్తా: చంద్రబాబు, టెండూల్కర్ భేటీ
కెసిఆర్తో తనకు ఏ విధమైన విభేదాలు లేవని, ఆయనతో కలిసి పనిచేస్తానని చంద్రబాబు చెప్పారు. కాగా చంద్రబాబుతో సచిన్ టెండూల్కర్ భేటీ అయ్యారు.
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావుతో తనకు ఏ విధమైన విభేదాలూ లేవని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంచేశారు. శనివారం ఆయన ఢిల్లీలో హిందుస్థాన్ టైమ్స్ నిర్వహించిన నాయకత్వ సదస్సులో 'ప్రపంచ నీటి సంక్షోభం- పరిణామాలు' అనే అంశంపై కీలక ప్రసంగం చేశారు.
తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఎపి ప్రస్తుతం మిగులు విద్యుత్తు గల రాష్ట్రంగా ఉఁదని, ఎపిలో 24 గంటల పాటు విద్యుత్తు అందిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో విద్యుత్తు సమస్యలు వచ్చే అవకాశం లేదని చెప్పారు.
కొత్త రాష్ట్రంలో ప్రధానంగా వ్యవసాయం, సాగునీటి రంగాలపై దృష్టిసారించినట్లు చంద్రబాబు చెప్పారు.వర్షపు నీరు నదులకు చేరే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తొలి అర్ధసంవత్సరంలో 25.6 శాతం వ్యవసాయం వృద్ధి సాధించినట్లు చెప్పారు.
తొమ్మిదేళ్ల పాలనలో 30 నుంచి 300 ఇంజినీరింగ్ కళాశాలలు ఏర్పాటుచేసినట్లు గుర్తుచేశారు. ఐటీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా తెలుగు విద్యార్థులు ఉన్నారని చెప్పారు. ప్రతి పాఠశాలలో డిజిటల్ తరగతులు ఉండాలని అన్నారు.
నూతన రాజధాని అమరావతిలో తాత్కాలిక సచివాలయం నిర్మించుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు అమరావతికి భవిష్యత్తులో కొన్ని విశ్వవిద్యాలయాలు రానున్నాయనీ, విజయవాడ-గుంటూరు నగరాల మధ్యలో అమరావతిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. తమ హయాంలోనే హైదరాబాద్ విమానాశ్రయం, సైబర్ సిటీలను నిర్మించినట్లు చెప్పారు. వాటిని చూస్తే ఎప్పుడూ గర్వంగా ఉంటుందని చెప్పారు.
2022 సంవత్సరం నాటికి దేశంలోని మూడు అగ్ర నగరాల్లో అమరావతి ఒకటిగా నిలపాలన్నదే తమ లక్ష్యమన్నారు. 2029 నాటికి దేశంలోనే అగ్ర, 2050 నాటికి ఉత్తమ మజిలీ నగరంగా అమరావతి నిలుస్తుందని ఆయన అన్నారు
టెండూల్కర్ భేటీ
కాగా, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆయన చంద్రబాబుతో 15 నిమిషాల పాటు వివిధ అంశాలపై చర్చించారు. తన దత్తత గ్రామమైన పుట్టంరాజుకండ్రిగలో అభివృద్ధి పనులను సచిన్ సీఎంకు వివరించారు. ప్రభుత్వం కూడా పూర్తిస్థాయిలో సహకరిస్తుందని టెండూల్కర్కు చంద్రబాబు చెప్పారు.
ఏపీ ఫైబర్గ్రిడ్ ప్రాజెక్టు వివరాలను, రూ.149కే కేబుల్, అంతర్జాలం, ఫోన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు చంద్రబాబు సచిన్కు తెలిపారు. ఇటీవల సచిన్ నెల్లూరు జిల్లాలో తన దత్తత గ్రామాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే.