ఏపీ నుంచి కియా మోటార్స్ తరలింపు: తమిళనాడు సర్కారు ఏమందంటే..?
Recommended Video
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురంలో ఏర్పాటు చేసిన వాహనాల తయారీ పరిశ్రమ 'కియా మోటార్స్'.. తమిళనాడుకు తరలిపోతుందంటూ 'రాయిర్స్' తన కథనంలో పేర్కొన్న నేపథ్యంలో రాష్ట్రంలో పెద్ద దుమారమే రేగుతోంది. ప్రతిపక్ష పార్టీ నేతలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారుపై తీవ్రంగా మండిపడుతున్నారు.
తాము తెచ్చిన పరిశ్రమలు కాపాడుకోవడం లేదంటూ చంద్రబాబు..
ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఏపీ సర్కారుపై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. కొత్త పరిశ్రమలు ఎలాగూ రావడం లేదు.. తాము కష్టపడి తెచ్చిన పరిశ్రమలను కూడా కాపాడుకోలేకపోతోందంటూ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంపై మండపడుతున్నారు. కియా పరిశ్రమ తరలింపు ఆలోచన రాష్ట్రానికే కాదు కేంద్రానికి కూడా నష్టం కలిగించేలా ఉంటుందన్నారు. సులభతర వాణిజ్యానికి ఇది గొడ్డలిపెట్టు అని ఆందోళన వ్యక్తంచేశారు. ఆర్థిక మంత్రి కథలు చెప్పడం కాదు.. కియా ప్రతినిధులకు వేలు చూపించి.. బెదిరింపులకు పాల్పడింది వైసీపీ ప్రజాప్రతినిధులు, నేతలు కాదా? అని ప్రశ్నించారు. పరిశ్రమలకు రాయితీలు కూడా ఇవ్వబోమని హెచ్చరిస్తే వారు ఇక్కడ ఎందుకుంటారని మండిపడ్డారు.
నిరాధారమంటూ ఏపీ సర్కారు..
అనంతపురంలో 1 బిలియన్ డార్లతో ఏర్పాటు చేసిన కియా ప్లాంటును తమిళనాడుకు తరలిస్తున్నారంటూ వార్తలు రావడంపై ఏపీ మంత్రులు కూడా స్పందించారు. కియా మోటార్స్ ఎక్కడికీ తరలించడం లేదని మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మండిపడ్డారు. కియా మోటార్స్ తరలిస్తున్నారని నిరాధారమైన వార్తలను నిస్సిగ్గుగా ప్రచారం చేస్తున్నారని ప్రతిపక్ష నేతలపై రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమిళనాడు సర్కారు ఏమందంటే..
కాగా, కియా మోటార్స్ తమిళనాడు రాష్ట్రానికి తరలిస్తున్నారనే వార్తలపై ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ స్పందించారు. ఈ విషయంలో కియా మోటార్స్.. తమిళనాడు ప్రభుత్వంకు మధ్య లాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. తాము తమిళనాడు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడామని, వారు ఇదే విషయాన్ని తెలిపారని స్పెషల్ చీఫ్ సెక్రటరీ తెలిపారు. కియా మోటార్స్తో తాము ఎలాంటి చర్చలు జరపలేదని తమిళపాడు ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పినట్లు తెలిపారు. కియా మోటార్స్ కూడా పరిశ్రమ తరలింపు వార్తలను ఖండించిందని ఆయన చెప్పారు. తమ పరిశ్రమ ఏపీలోనే కొనసాగుతుందని వారు చెప్పినట్లు తెలిపారు. అంతేగాక, కియా మోటార్స్ ఇప్పటి వరకు 2 లక్షలుగా ఉన్న యూనిట్లను 3 లక్షలకు పెంచే ప్రణాళికలను సిద్ధం చేస్తోందని తెలిపారు.