కాకినాడ ఎన్నికల్లో 'కాపు' ఎఫెక్ట్ లేదా?: ముద్రగడ అంచనాకు భిన్నంగా, అంతా టీడీపీ వైపే!
కాకినాడలో కాపు సామాజికవర్గం బలంగా ఉన్నప్పటికీ.. వారంతా టీడీపీకే అనుకూలంగా ఉన్నారని ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
కాకినాడ: కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల ఫలితాల్లోను నంద్యాల ఫలితమే రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం 48స్థానాలకు గాను ఇప్పటికే 20కి పైగా స్థానాల్లో టీడీపీ దూసుకెళ్తుండటంతో దాదాపుగా ఫలితం ఆ పార్టీకే అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది.
ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. తూర్పుగోదావరి జిల్లా కేంద్రంగానే ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమాన్ని నడుపుతున్నప్పటికీ.. దాని ఎఫెక్ట్ ఎన్నికలపై లేనట్లుగానే స్పష్టమవుతోంది. దాదాపు 40వేల పైచిలుకు ఉన్న కాపు సామాజికవర్గం టీడీపీకి అనుకూలంగా ఉన్నారు కాబట్టే ఆ పార్టీకి సానుకూల ఫలితాలు వస్తున్నట్లు తెలుస్తోంది.
మత్స్యకారుల తర్వాత కాపులు, క్రిస్టియన్లు, ఇక్కడ బలమైన సామాజిక వర్గంగా ఉన్నారు. వారి తర్వాత బ్రాహ్మణ, వైశ్య సామాజికవర్గాలు కూడా కీలకంగా ఉన్నాయి. అయితే వీరంతా వైసీపీ కన్నా టీడీపీనే బెటర్ అనే ఆలోచనలో ఉన్నారు కాబట్టే ఫలితాల ట్రెండ్ ఈవిధంగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఒకవిధంగా ఈ ఫలితాలు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు ప్రతికూలం అనే చెప్పాలి. కాపులు ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న ఆయన ఆరోపణల ప్రభావం ఎన్నికల ఫలితాల్లో మాత్రం కనిపించడం లేదు. ముద్రగడకు ఈ ఫలితాలు ప్రతికూలమైతే, సీఎం చంద్రబాబుకు మరింత ధీమాను పెంచే విషయం.
నంద్యాల, కాకినాడల్లో వరుసగా సత్తా చాటడం టీడీపీ విశ్వాసాన్ని మరింత పెంచింది. ఎన్టీఆర్ హయాం నుంచి అధికారంలో ఉన్నా లేకున్నా కాపులకు తమ పార్టీలో ప్రాధాన్యం తగ్గలేదు కాబట్టే ప్రజలు టీడీపీకి మద్దతుగా ఉన్నారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. మొత్తం మీద వరుస విజయాలతో భవిష్యత్తు రాజకీయంపై కూడా టీడీపీ భరోసాగా ఉందనే చెప్పాలి. అదే సమయంలో కాపులు కూడా టీడీపికి మద్దతు పలకడం వెనుక ముద్రగడ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.