ఏపీలోకి స్టాండర్డ్ పాస్ ఉన్నా నో ఎంట్రీ .. సరిహద్దుల్లో చుక్కలు చూపిస్తున్న ఏపీ పోలీసులు
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కట్టడికి ప్రభుత్వం తీవ్ర యత్నం చేసినా కరోనా కంట్రోల్ లోకి రావటం లేదు. ఇప్పటి వరకు 2,355 కేసులు నమోదు కాగా 953 యాక్టివ్ కేసులు ఉన్నాయి.149 మంది ఇప్పటికే మృత్యువాత పడ్డారు . ఇక తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు ఏపీతో పోల్చి చూస్తే తక్కువ నమోదు అవుతున్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వం ఇతర ప్రాంతాలకు వెళ్ళే వారికి వెసులుబాటు కల్పించినా కూడా ఏపీలోకి వెళ్ళే వారిని అనుమతించని పరిస్థితి .
ఏపీలో ఎగ్జిట్ ప్లాన్ రూపొందిస్తున్న జగన్ సర్కార్ .. రీజన్ ఇదే !!
పాసులు ఉన్నా సరే ఏపీలోకి నో పర్మిషన్
ఏపీ, తెలంగాణా రాష్ట్ర సరిహద్దుల్లో ప్రస్తుతం ఏపీలోకి అనుమతి ఇవ్వకపోవటంతో ప్రజలు టెన్షన్ పడుతున్నారు . ఇక లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా ఎవరి ప్రాంతాలకు వారు వెళ్లేందుకు అవకాశం కల్పించింది ప్రభుత్వం. అయినా సరే ఏపీ అధికారులు అనుమతి నిరాకరిస్తున్నారు. ప్రత్యేక పాసులతో వెళ్ళటానికి ప్రయత్నం చేసినా సరే వివిధ ప్రాంతాలకు వెళ్తున్న ప్రజలను ఏపీ తెలంగాణ చెక్ పోస్టుల దగ్గర ఆపేస్తున్నారు . దీంతో ఏపీ తెలంగాణా బోర్డర్ లో వాహనాలు బారులు తీరాయి.
ఎమర్జెన్సీ మినహాయించి ఏ పాసులను అనుమతించని ఏపీ పోలీసులు
ఇక తెలంగాణా అధికారులు ఏపీ నుంచి తెలంగాణ వెళ్లే వాహనాలకు డీజీపీ లేదా జిల్లా అధికారుల పాసులు ఉంటే అనుమతిస్తున్నారు. కానీ , తెలంగాణ నుంచి వచ్చే వాహనాలను ఏపీ పోలీసులు అనుమతించడం లేదు. మెడికల్, డెత్, ప్రెగ్నెంట్ ఎమెర్జన్సీ ఉన్న వారి పాసులు మినహాయించి ఇంకా ఇతర పాసులు ఏవీ ఏపీ పోలీసులు అనుమతించటం లేదు . తెలంగాణ నుంచి వచ్చే కొన్ని వాహనాలకు పాసులున్నా సరే అనుమతించక పోవటంతో దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు .
సరిహద్దులు దాటితే క్వారంటైన్ .. బోర్డర్ లోనే ఆపేస్తున్న ఏపీ పోలీసులు
స్టాండర్డ్ పాసులు ఉన్నా సరే జగ్గయ్య పేట చెక్ పోస్టు దాటి రానివ్వడం లేదు. మరోవైపు సరిహద్దులు దాటి వచ్చే వారిని హోం క్వారంటైన్కు తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. స్టాండర్డ్ పాసులు పట్టుకుని హైదరాబాద్ నుంచి ఉత్సాహంగా వెళ్తున్న ప్రయాణికులు ఏపీలో మాత్రం కాలు పెట్టలేని పరిస్థితి నెలకొంది. జగ్గయ్యపేట నుంచి మళ్లీ వెనక్కి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో తెలంగాణా పోలీసులు ఇచ్చిన పాసులను ఆంధ్రా పోలీసులు అనుమతించటం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . పాసులపై ముందే క్లారిటీ ఇస్తే బాగుంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సమస్యను పరిష్కరించాలని పాసులు తీసుకుని వచ్చే వారికి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.