సినిమాలు, రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు, దృష్టంతా హెరిటేజ్ అభివృద్ధిపైనే : నారా బ్రాహ్మణి
శనివారం ఫిక్కీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా నారా బ్రాహ్మణి మాట్లాడుతూ రాజకీయాలు, సినిమా రంగంలోకి వచ్చే ఆలోచన లేదని, తన దృష్టంతా హెరిటేజ్ అభివృద్ధిపైనే ఉందన్నారు.
హైదరాబాద్: తన దృష్టంతా హెరిటేజ్ అభివృద్ధిపైనే ఉందని నారా బ్రాహ్మణి స్పష్టం చేశారు. పాల ఉత్పత్తిలో దేశంలోనే హెరిటేజ్ను నెం.1 గా తీర్చిదిద్దుతామన్నారు. 10 లక్షల మంది రైతులకు హెరిటేజ్ ద్వారా సేవ చేస్తున్నామని, ఇంతకన్నా ఇంకా ఏం కావాలని ఆమె వ్యాఖ్యానించారు.
శనివారం ఫిక్కీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుటుంబ సహకారం వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానన్నారు. రాజకీయాలు, సినిమా రంగంలోకి వచ్చే ఆలోచన లేదని బ్రాహ్మణి స్పష్టం చేశారు.
హెరిటేజ్ డెయిరీ వ్యాపారాన్ని వచ్చే ఐదేళ్లలో రూ.6 వేల కోట్ల టర్నోవర్కు చేర్చడమే తన లక్ష్యమని చెప్పారు. డెయిరీ రంగంలో రిలయన్స్ డెయిరీ కొనుగోలు పూర్తి అయిందని, ఈ రంగంలో మరిన్ని కంపెనీల కొనుగోలుకు సిద్ధంగా ఉన్నామని బ్రాహ్మణి పేర్కొన్నారు.
వాళ్లు కష్టపడుతూ ఉంటారు.. మేం ఖర్చుపెడుతూ ఉంటాం: లోకేష్
ఫిక్కీ సదస్సులో పాల్గొన్న ఏపీ మంత్రి నారా లోకేష్ ఆ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ''అమ్మ, బ్రాహ్మణి కష్టపడుతూ ఉంటారు. నేను, నాన్న బాగా ఖర్చుపెడుతూ ఉంటాం. ఆడవాళ్ళ సమస్యలపై ఫిక్కీ సదస్సులో చర్చించాం. చాలా మంది మహిళలు వాళ్ళ ఆలోచనలను తెలియజేశారు. స్కూల్ పిల్లలకు పాలు ఇమ్మని చెప్పారు..'' అని లోకేష్ పేర్కొన్నారు.
ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని, రాజకీయాల్లో కానీ.. ఇంట్లో కానీ మహిళలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుందన్నారు. టీడీపీలో ముందు నుంచీ మహిళలకు పెద్ద పీట వేస్తున్నామని లోకేష్ చెప్పారు.