'ఇతరులు లోనికి రాకూడదు'..అంటూ బోర్డు పెట్టిన గ్రామం:కారణం...విచిత్రమే;షరతులూ వింతే!
శ్రీకాకుళం:'ఇతరులు లోనికి రాకూడదు'...అనే ఈ బోర్డ్ సాధారణంగా ప్రభుత్వ రక్షిత కార్యాలయాల వద్దో...లేక ప్రైవేట్ కార్పోరేట్ ఆఫీసుల వద్దో కనిపిస్తుండటం కద్దు. అయితే ఆంధ్రప్రదేశ్ లోని ఒక మారుమూల గ్రామం తమ ఊళ్లోకి అనుమతిని నిరాకరిస్తూ ఈ బోర్డు పెట్టడం ఒక విశేషమైతే...అందుకు వారు చెప్పిన కారణం ఇంకా విచిత్రంగా ఉంది. అంతేకాదు ఒకవేళ తమ ఊళ్లోకి ఎవరైనా రావాలనుకుంటే అందుకు పాటించాల్సిన షరతు కూడా వింత గానే ఉంది. ఇన్ని విశేషాలతో చర్చనీయాంశంగా మారిన ఆ ఊరు, ఆ బోర్డు, దాని వెనుక కారణాలు ఏమిటో తెలుసుకోవాలని ఉందా?...అయితే చదివేయండి.
'ఇతరులు లోనికి రాకూడదు'...అనే ఈ బోర్డు పెట్టింది శ్రీకాకుళం జిల్లా ఏజెన్సీలోని చెక్కాపురం గ్రామస్థులు. ఆ మేరకు వాళ్లు తమ ఊరి ఎంట్రన్స్ లోనే ఈ హెచ్చరిక బోర్డ్ ను గ్రామంలోకి వెళ్లే రోడ్డుకు అడ్డంగా పెట్టేసి దారి మూసేశారు. ఊళ్లోకి రాకుండా నిషేధాన్ని విధించడానికి ఈ గిరిజన గ్రామస్థులు చెబుతున్న కారణం తమ ఊళ్లో పండుగ చేసుకుంటున్నారట.
చెక్కాపురం గ్రామంలో ఈ నెల 19 నుంచి 24 వరకు 'గజం కంది పండగ' చేసుకుంటున్నామని...ఆ పండగకు ఎవరుబడితే వారు...ఎలా బడితే అలా రావడానికి వీలులేదని...అందుకే ఆ బోర్డు ఏర్పాటు చేశామని వారు చెబుతున్నారు.పండుగ జరిగే ఈ ఐదు5 రోజులూ తమ గ్రామంలోకి ఇతరులు రాకూడదని, ఒకవేళ ఏదేని కారణం చేత వస్తే పండుగ రోజులు అయ్యేంత వరకూ తిరిగి వెళ్లరాదని వారు చెబుతున్నారు.
అంతేకాదు ఆ మేరకు హెచ్చరికలతో కూడిన బ్యానర్లు, పోస్టర్లు సైతం ఏర్పాటు చేశారు. అంతేకాదు తమ హెచ్చరికలకు తగిన విధంగా పండుగ మొదలైన నాటినుంచి గ్రామస్థులు ఒక్కరు కూడా ఊరు దాటి బయటకు రావడం గాని...గ్రామంలోకి ఎవరూ ప్రవేశించకుండా గాని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదండీ...ఆ గ్రామం పెట్టిన హెచ్చరిక బోర్డు వెనుక కథాకమామీషు!