జగన్ సర్కారుకు హైకోర్టు సీరియస్ వార్నింగ్- నమ్మకం లేకపోతే కోర్టు మూయించేసుకోండని..
ఏపీ ప్రభుత్వానికీ, హైకోర్టుకూ జరుగుతున్న పరోక్ష యుద్ధం తాజాగా మరో మలుపు తీసుకుంది. హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెలువడుతున్న తీర్పులపై సోషల్ మీడియా పోస్టుల వెనుక ప్రభుత్వమే ఉందనే అర్ధం వచ్చేలా హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. ప్రభుత్వం తీరుపై తీవ్ర అసహనంగా ఉన్న హైకోర్టు ఇప్పటికే పలు కేసుల్లో సీరియస్గా స్పందిస్తుండగా.. ఇప్పుడు ఏకంగా తమపై నమ్మకం లేకపోతే హైకోర్టును మూసేయాలని కేంద్రాన్ని కోరాలని, అంతే కానీ కోర్టు ప్రతిష్ట దిగజార్చేలా వ్యవహరించవద్దని సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. మీరు చట్ట ప్రకారం వ్యవహరించకపోతే మేమే ఆ పని చేస్తామంటూ కూడా హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.
వ్యభిచారం క్రిమినల్ నేరం కాదని బొంబే హైకోర్టు సంచలన తీర్పు
హైకోర్టుపై సోషల్ పోస్టులు..
ఏపీ ప్రభుత్వానికి ప్రతికూలంగా ఉన్న హైకోర్టు తీర్పులపై ఆగ్రహంగా ఉన్న వైసీపీ నేతలు, అభిమానులు కొందరు తాజాగా సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారు. కోర్టు తీర్పులను ప్రశ్నించేలా, కోర్టులకు దురుద్దేశాలు ఆపాదించేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. వీటిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ లక్ష్మీనారాయణ అనే న్యాయవాది గతంలో పిల్ దాఖలు చేశారు. దీనిపై స్పందించి దాదాపు వంద మందికి పైగా ఇలాంటి వారిపై కేసులు నమోదు చేయాలని సీఐడీకి హైకోర్టు ఆదేశాలు కూడా ఇచ్చింది. అయినా ఈ పోస్టుల పరంపర ఆగలేదు. దీంతో నిన్న మరోసారి ఈ వ్యవహారంపై నిన్న జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ ఉమాదేవి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా హైకోర్టు తీవ్రంగా స్పందించింది. కోర్టులపై సోషల్ పోస్టుల వెనుక ఉన్న కుట్రను తేలుస్తామంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.
హైకోర్టుపై నమ్మకం లేకపోతే మూయించేసుకోండి...
సోషల్ మీడియా పోస్టులపై విచారణ సందర్భంగా హైకోర్టు పలుమార్లు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. న్యాయవ్యవస్ధ ప్రతిష్టను దిగజార్చడాన్ని ఎట్టి పరిస్ధితుల్లోనూ సహించబోమని, దీని వెనుక ఏదైనా కుట్ర ఉందేమో తేలుస్తామంటూ వార్నింగ్ ఇచ్చింది. ఎవరో ఒకరి ప్రభావం లేకుండా ఏకంగా న్యాయమూర్తులను ఎవరూ దూషించరని కోర్టు అభిప్రాయపడింది. న్యాయవ్యవస్ధపై విశ్వాసం లేకపోతే పార్లమెంటుకు వెళ్లి హైకోర్టును మూయించేసుకోవడమే ఉత్తమం అని న్యాయస్ధానం తీవ్రంగా వ్యాఖ్యానించింది. దీంతో విచారణ సందర్భంగా హాజరైన ఏజీ, ఇతర న్యాయవాదులు కూడా ఇబ్బందికరమైన పరిస్ధితి ఎదుర్కోవాల్సి వచ్చింది.
రూల్ ఆఫ్ లా మేమే అమలు చేస్తాం...
సోషల్ మీడియా పోస్టులపై విచారణ సందర్భంగా రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదా అని హైకోర్టు ఏజీని ప్రశ్నించింది. రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలన అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, దాన్ని అమలు చేయలేకపోతే మేమే మా అధికారం వినియోగించి అమలు చేస్తామంటూ హైకోర్టు మరో సీరియస్ హెచ్చరిక చేసింది. అదే సమయంలో వ్యవస్ధలను రక్షించుకోవాల్సిన అవసరం అందరిపైనా ఉందని, ఇలాంటి పోస్టులను మీరు కూడా ప్రోత్సహించకూడదంటూ విచారణకు హాజరైన సోషల్ మీడియా సంస్ధల తరఫు న్యాయవాదులను ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్యంలో ఇతరులను కూడా గౌరవించాలని ధర్మాసనం తెలిపింది. ఈ వ్యవహారంలో న్యాయ వ్యవస్ధ ప్రతిష్టను కాపాడేందుకు తమ వంతు సహకారం అందిస్తామని విచారణకు హాజరైన సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే తెలిపారు.
Recommended Video
న్యాయవ్యవస్ధ నిస్పృహకు గురైతే అంత్యర్ధుద్ధమే...
ప్రజాస్వామ్యం శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్ధ అనే మూడు స్తంభాలపై ఆధారపడి ఉంటుందని, ఇందులో న్యాయవ్యవస్ధ నిస్పృహకు గురైతే ఆ పరిస్ధితి అంతర్యుద్ధానికి దారి తీయొచ్చంటూ హైకోర్టు ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. న్యాయవ్యవస్ధపై నమ్మకం పోతే ప్రతీ ఒక్కరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారని హైకోర్టు విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో విదేశీ సోషల్ మీడియా సంస్ధలదీ బాధ్యత ఉందని, వారు స్వయం నియంత్రణ పాటించాలని కోర్టు సూచించింది. అలాగే ఈ వ్యవహారంలో ఇప్పటివరకూ నమోదైన కేసులు, వాటి తాజా దర్యాప్తు పరిస్దితి వివరాలతో మళ్లీ విచారణకు రావాలని హైకోర్టు సీఐడీకి సూచించింది.