రాజకీయాల్లో ఫుల్ స్టాప్ లు ఉండవండీ.. కామాలే ఉంటాయండీ..! అదికారం లేకున్నా ప్రజలతోనేనన్న బాబు..!!
అమరావతి/హైదరాబాద్ : 37 ఏళ్లుగా టీడీపీ పార్టీ ప్రజలకు సేవలు అందిస్తోందని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చిచూద్దామని వారు ఏదో చేసి చూపుతామని అంటున్నారని తెలిపారు. మంగళవారం ఎన్టీఆర్ 97వ జయంతి వేడుకల సందర్భంగా గుంటూరు జిల్లాలో నివాళి అర్పించి..అక్కడే ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడారు. తెలుగువారి గుండెల్లో చిరస్మరణీయంగా ఎన్టీఆర్ మిగిలిపోతారని తెలిపారు. ఆయన్ను చూసి కష్టాలు మరిచిపోయి ముందుకు వెళ్లాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
ఎన్టీఆర్ ను చూసి స్పూర్తి పొందాలి..! నిరుత్సాహ పడొద్దన్న బాబు..!!
తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడిన శక్తి ఎన్టీరామారావు అని కొనియాడారు. నిమ్మకూరులో పుట్టి...ఒక రోజు సబ్ రిజిస్టర్ గా చేసి సినిమాల్లో నటించారని గుర్తుచేశారు. సమాజానికి ఏదో చేయాలని రాజకీయాల్లోకి వచ్చారన్నారు. రాజకీయాల కోసం ఆయన రాలేదని...ఆయనకు అపజయాలు కలిగినా మనోనిబ్బరంతో ముందుకు వెళ్లారన్నారు. రాష్ట్రంలో అనేక మార్పులు తీసుకువచ్చారన్నారు.
ఎన్టీఆర్ రాజకీయ చతురత..! మహిళలను గౌరవించిన పెద్దాయన..!!
సమాజమే దేవాలయం...పేదవారే దేవుళ్లని తూచాతప్పకుండా పాటించిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దు చేశారని గుర్తు చేశారు. మహిళల కోసం పెద్దపీఠ వేశారన్నారు. ఎన్నో ఏండ్లుగా కష్టపడి టీడీపీ జెండా మోస్తున్న కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు వెళ్లానని అన్నారు. నాలుగైదు రోజులుగా పలువురు ఇంటికి వచ్చి బాదపడుతున్నారని, అన్నం కూడా తినడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజా స్వామ్యంలో గెలుపోటములు సహజం..! సహనం అవసరమన్న బాబు..!!
తాను మూడున్నర దశాబ్దాలుగా అండగా ఉన్నానని..ఇకపైనా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. జీవితంలో ఇబ్బందులు వస్తాయని, వాటిని అధిగమించాలని సూచించారు. కుటుంబ సభ్యులను లెక్కపెట్టకుండా రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పనిచేసానని తెలిపారు. అన్నింటిపైనా చర్చించుకుంటున్నామన్నారు. సమస్యలపై పోరాడదమని అన్నారు.
ప్రభుత్వాలు మారడం సమంజసమే ..! ఎవరేం చేసారో ప్రజలే నిర్ణయిస్తారన్న మాజీ సీఎం..!!
కొత్తగా ప్రభుత్వం వచ్చినప్పుడు కొన్ని చెప్పారని ఏంఏం చేస్తారో చేయనివ్వండి అన్నారు. 40శాతం ఓట్లు మనకు వచ్చాయని కావున ప్రజలకు సేవలు అందించాలని తెలిపారు. లోపాలను సరి చేద్దామని తెలిపారు. వెనుకబడిన ప్రజల కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం అని చెప్పారు. పార్టీకి మళ్లీ పూర్వవైభవం తీసుకువద్దామని అన్నారు. అధైర్యపడొద్దని కార్యకర్తలకు సూచించారు.