హోదాపై తగ్గం, హైద్రాబాద్ వెళ్లాక చెప్తా: బాలకృష్ణ, తమిళనాడుకు ఐఎన్ఎస్ ఐరావత్
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ఎట్టి పరిస్థితుల్లోను తగ్గేది లేదని హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. ఏపీ, చెన్నై భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్నాయని ఆదుకోవాలని కేంద్రాన్ని కోరారు. తాను డిక్టేటర్ సినిమా కోసం ఢిల్లీ వచ్చినట్లు చెప్పారు.
తాను కేంద్రమంత్రులు మహేష్ శర్మ, నితిన్ గడ్కరీ తదితరులను కలుస్తానని చెప్పారు. తాను హైదరాబాద్ వెళ్లగానే చెన్నై వరద బాధితులకు సాయం ప్రకటిస్తానని చెప్పారు.
చెన్నై చేరుకున్న ఐఎన్ఎస్ ఐరావత్ నౌక
చెన్నైలో భారీ వర్షాల నేపథ్యంలో సాయం కోసం విశాఖ నుంచి తూర్పు నౌకాదళ అధికారులు, సిబ్బందితో ఐఎన్ఎస్ ఐరావత్ నౌక గురువారం మధ్యాహ్నం చెన్నైకి చేరుకుంది. ఇందులో 250 మంది సిబ్బంది ఉంటారు. ఇందులో 20 మంది గజ ఈతగాళ్లు.
ఆహార పదార్థాలు, నీళ్లలో చిక్కుకుపోయిన వారిని రక్షించడానికి ఉపయోగించే జెమినీ పడవలు, నీళ్లను తోడివేసే పంపుసెట్లు, నిపుణులైన గజ ఈతగాళ్లు, డైవర్లను ఈ నౌక తీసుకు వచ్చింది. వీరంతా చెన్నైలోని తాంబరం, అడయార్బ్రిడ్జ్ తదితర చోట్ల అవసరమైన సేవలు అందిస్తారు.
చెన్నైలోని ఐఎన్ఎస్ అడయార్ కార్యాలయ ప్రాంగణంలో వందమందికి వసతి, భోజనం కల్పించడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు. ప్రమాదాల బారిన పడిన బాధితుల కోసం రెండు వైద్య బృందాలను ఈ నౌకలో వచ్చారు. వివిధ ప్రాంతాల్లో నీటి మధ్య చిక్కుకుపోయి సాయం కోసం ఎదురుచూస్తున్న వారిని గుర్తించడానికి ఒక యుఎవి (అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికిల్) కూడా రంగంలోకి దించారు.
హెలీకాపర్ట్ పరిమాణంలో ఉండే యుఎవి గగనతలంలో ప్రయాణిస్తూ వివిధ ప్రాంతాల దృశ్యాలను చిత్రీకరించి కంట్రోల్ రూంకు పంపిస్తుంది. ఆయా చిత్రాలు వీడియోల ఆధారంగా బాధితుల్ని గుర్తించి వారిని రక్షించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయడానికి అవకాశముంటుంది.
బెంగళూరు నుంచి అదనపు బలగాలను చెన్నైకి పంపించారు. బేగంపేట విమానాశ్రయం నుంచి రెస్క్యూ టీంలు తరలి వెళ్లాయి. నాలుగు విభాగాలుగా 134 మంది రెస్క్యూ టీంలు సేవలు అందిస్తారు. కాగా, చెన్నైలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.