తలపై జుట్టులేదు.. తలలో మెదడు లేదు: మిథున్ రెడ్డి వర్సెస్ గల్లాజయదేవ్, హీటెక్కిన ట్విటర్ వార్
లోక్సభలో తెలుగు రాష్ట్రాల ఎంపీలు మాటల యుద్ధానికి దిగారు. అక్కడి నుంచి ఆ యుద్ధం ట్విటర్పై సాగింది. ఈ వార్ ఎంతవరకు పోయిందంటే ఆ ఇద్దరు ఎంపీలు ట్విటర్ వేదికగా వ్యక్తిగత దూషణలు చేసుకునేంత వరకు. ఇంతకీ ఆ ఎంపీలు ఎవరో తెలుసా..?
మిథున్ రెడ్డి వీడియోను ట్విటర్లో పోస్టు చేసిన గల్లా
"నో హెయిర్ నో బ్రెయిన్" ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో బాగా వినిపిస్తున్న స్లోగన్. ప్రజా ప్రతినిధులు వ్యక్తిగత దూషణలకు దిగుతుండటం అది కూడా సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేసుకుంటుండటంతో నెటిజెన్లకు మంచి టైంపాస్ అవుతోంది. తాజాగా పార్లమెంటులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడిన వీడియోను టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ట్విటర్లో పోస్టు చేశారు. ఇక్కడి నుంచే రాద్దాంతం మొదలైంది.
మిథున్ రెడ్డి స్పీచ్ వీడియోను ట్వీట్ చేసిన గల్లా
ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ డమ్మీ కంపెనీ అని ఆ సంస్థకు రూ.1000 కోట్లు విలువ చేసే భూమిని అప్పటి టీడీపీ ప్రభుత్వం కేవలం రూ.30 కోట్లకు కేటాయించిందని లోక్సభలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి చెప్పారు. అంతేకాదు ఇందులో పెద్ద స్కామ్ జరిగిందని ఆయన చెప్పారు. ఈ వీడియోనే టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ట్విటర్లో పోస్టు చేశారు. అంతేకాదు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థ 1947లో ప్రారంభమైందని భారత్లో గత రెండు దశాబ్దాలుగా ఆపరేషన్స్ నిర్వహిస్తోందని పోస్టులో రాసుకొచ్చారు. ఇక ఆ కంపెనీ ఏపీలో పెట్టుబడులు ఉపసంహరించుకోవడంలో ఎలాంటి అనుమానం లేదని రాసుకొచ్చారు గల్లా.
తలపై జుట్టు ఉండదు.. తలలో మెదడు ఉండదు
టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పోస్టు చేసిన వీడియోకు సమాధానం ఇచ్చారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. కొందరికి తలపై జుట్టు ఉండదు తలలో మెదడు ఉండదని గల్లా జయదేవ్ను ఉద్దేశిస్తూ మిథున్ ట్వీట్ చేశారు. గల్లా జయదేవ్కు ఇప్పటి వరకు తలపై వెంట్రుకలు లేవని మాత్రమే అనుకున్నానని ఇప్పుడు తలలో మెదడు కూడా లేదని తెలుసుకున్నానని మిథున్ ట్వీట్ చేశారు. ఏపీ నుంచి ఇన్వెస్టర్లను వెళ్లగొట్టేందుకు ఎందుకు అంత తొందర అని ప్రశ్నించారు. ఎవరు బాధ్యతారాహిత్యంతో ప్రవర్తిస్తున్నారని ప్రశ్నించిన మిథున్ రెడ్డి అది టీడీపీనే అని మండిపడ్డారు.
గల్లాను బాడీ షేమింగ్ చేయడంపై మిథున్ పై నెటిజెన్ల ఫైర్
గల్లా జయదేవ్ మిథున్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం ఇక్కడితో ఆగలేదు. మిథున్ రెడ్డికి జయదేవ్ ఘాటు సమాధానం ఇచ్చారు. రాష్ట్రం నుంచి ఇన్వెస్టర్లను ఎవరు పంపుతున్నారు.. పెట్టుబడులు ఉపసంహరించుకునేలా ఎవరు చేస్తున్నారు..? అని గల్లా ప్రశ్నించారు. ఇక తనపై వ్యక్తిగతంగా చేసిన కామెంట్స్ గురించి ప్రజలే స్పందిస్తారని మిథున్ రెడ్డికి తెలివిగా సమాధానం ఇచ్చారు. ఇక గల్లా జయదేవ్పై బాడీ షేమింగ్కు పాల్పడ్డ ఎంపీ మిథున్ రెడ్డిపై నెటిజెన్లు తమదైన శైలిలో కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.