హెల్మెట్ ఉంటేనే పెట్రోలు: కలెక్టర్ ఆదేశాలు.
హెల్మెట్ ధరించి వస్తేనే పెట్రోలు బంకుల్లో పెట్రోలు పోయాలని, లేదంటే తిప్పి పంపాలని జిల్లా సంయుక్త పాలనాధికారి పీఎస్ గిరీష పెట్రోలు బంకుల యాజమానులకు స్పష్టం చేశారు.
చిత్తూరు: హెల్మెట్ ధరించి వస్తేనే పెట్రోలు బంకుల్లో పెట్రోలు పోయాలని, లేదంటే తిప్పి పంపాలని జిల్లా సంయుక్త పాలనాధికారి పీఎస్ గిరీష పెట్రోలు బంకుల యాజమానులకు స్పష్టం చేశారు.
గురువారం ఉదయం జిల్లా సచివాలయంలో రోడ్డు ప్రమాదాల నివారణ, హెల్మెట్ వినియోగం తదితర అంశాలపై రవాణా శాఖ, అర్అండ్బీ, పౌరసరఫరాల, పెట్రోలు బంకుల యజమానులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడంతో పాటు హెల్మెట్ వినియోగం పెంచడం ద్వారా మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు అధికారులు కృషి చేయాలని జేసీ సూచించారు.
'జిల్లాలో సగటున రోజుకు మూడు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలకు కారణాలను విశ్లేషించాం. ఆ ప్రాంతాలను గుర్తించాం. అక్కడ సూచికబోర్డులు, వేగనిరోధకాలు ఏర్పాటు చేయాల'ని ఆదేశించారు.
హెల్మెట్ ధరించి వాహనాలను నడపడంపై ఈ నెల 8 నుంచి 14వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. 'ప్రతి పెట్రోలు బంకులో ప్రచార బోర్డులు ఏర్పాటు చేయాలి. పెట్రోలు కోసం వచ్చే వాహనదారులకు అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడం, రహదారి నిబంధనలు పాటించకపోవడం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా ఓ వ్యక్తిని నియమించాలి.
ప్రతి బంకులో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ఈనెల 15వ తేదీ నుంచి హెల్మెట్ పెట్టుకొని వచ్చే వాహనదారులకే పెట్రోలు పోయాలి. లేనివారికి పట్టొద్దు. సీసీ కెమెరాల ద్వారా ఈ ప్రక్రియను తనిఖీ చేస్తాం. హెల్మెట్ లేకపోయినా పెట్రోలు పట్టినట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామ'ని జేసీ హెచ్చరించారు. పెట్రోలు బంకుల్లో మరుగుదొడ్లు, గాలి పట్టే యంత్రాలు ఏర్పాటు చేయాలని, ఆవరణాన్ని పచ్చదనంతో నింపాలన్నారు.