తెలంగాణాకు జరిగిన అన్యాయం ఏం లేదు .. వాటర్ వార్ పై ఏపీ మంత్రి అనీల్
తాజాగా శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి ఏపీ లిఫ్ట్ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని ఎత్తిపోయాలని ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో తెలంగాణా ప్రభుత్వం విబేధించిన విషయం తెలిసిందే. శ్రీశైలం ఉమ్మడి ప్రాజెక్ట్ అని, ఏ నిర్ణయం అయినా ఇరు రాష్ట్రాలు కలిసి తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఏపీ నిర్ణయంపై ఫైర్ అయ్యారు. న్యాయ పోరాటం చేస్తామని , కృష్ణా వాటర్ బోర్డుకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్ లో కానీ కొత్త నీటి పారుదల ప్రాజెక్టు నిర్మాణం చేపడితే అపెక్స్ కమిటీ అనుమతి తీసుకోవాలని ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం స్పష్టంగా పేర్కొంది. కానీ అదేమీ లేకుండా ఏక పక్ష నిర్ణయం తీసుకుందని సీఎం కేసీఆర్ మండిపడుతున్నారు.
తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త జల జగడం ... తగ్గేదెవరో... నెగ్గేదెవరో !!
ఇక ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మూడు టిఎంసిల నీటిని లిఫ్టు చేసే విధంగా కొత్త ఎత్తిపోతల పథకం చేపట్టడానికి సంబంధించి జీవో కూడా విడుదల చేసింది ఏపీ సర్కార్ . దీంతో తెలుగు రాష్ట్రాల మధ్య మరోమారు వాటర్ వార్ నెలకొంది. దీనిపై స్పందించిన ఇరిగేషన్ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ కృష్ణా జలాలపై రాజకీయాలు తగదని పేర్కొన్నారు. కృష్ణా జలాల వినియోగంపై కొన్ని పార్టీలు రాజకీయం చేయడం సరికాదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ అన్నారు. ఇక ఉమ్మడి ప్రాజెక్ట్ విషయంలో తెలంగాణా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామని, కరోనా ఎఫెక్ట్ వల్ల భేటీ కుదరలేదని అన్నారు. త్వరలో భేటీ అయ్యి మాట్లాడతామని పేర్కొన్నారు.
తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు స్నేహపూర్వక సంబంధాలున్నాయని పేర్కొన్నారు. కేవలం వరద నీటిని సద్వినియోగం చేసుకునేందుకే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇందులో తెలంగాణకు అన్యాయం చేసేదేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. వృధా పోతున్న నీటిని కాపాడుకునే యత్నమే అన్నారు. రెండు రాష్ట్రాలకు కృష్ణా నీటి కేటాయింపుల్ని బోర్డు నిర్ణయిస్తుందని, ఆ పరిధిలోనే రెండు రాష్ట్రాలూ వాడుకుంటాయని చెప్పారు మంత్రి అనిల్.