మద్యం కేసుల్లో శిక్ష పడితే నో లైసెన్స్: ఏపీలో బార్ల కేటాయింపు నూతన పాలసీ ఇదే
వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం పై దృషి సారించారు. అందుకే దశల వారీగా మద్య నియంత్రణ చేపట్టారు. ఇక తాము అధికారంలోకి వస్తే దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పిన జగన్ ఆ దిశగా అడుగులు బాగానే వేస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న జగన్ ముందు బెల్ట్ షాపులకు చెక్ పెట్టి , ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించాలని నిర్ణయించారు . ఇక సెప్టెంబర్ 1 నుండి కొత్త మద్యం పాలసీ అమలు చేస్తున్న సర్కార్ జనవరి 1 నుండి బార్ల పైన కూడా నూతన విధానం అమలు చెయ్యనుంది.
జనవరి 1 నుంచి బార్ల కేటాయింపులో నూతన పాలసీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా ఏపీ సర్కార్ అడుగులు వేస్తుంది. జనవరి 1 నుంచి బార్ల కేటాయింపులో నూతన పాలసీని తీసుకురావాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం నియమ నిబంధనలను కఠినతరం చేయాలని భావిస్తుంది . ఇక ఈ మేరకు నియమ నిబంధనలతో ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం నూతన విధానం ప్రకారం మద్యం కేసుల్లో శిక్షలు పడినవారికి లైసెన్స్ ఇవ్వమని తేల్చిచెప్పింది.
కఠినతరంగా నియమ నిబంధనలు
బార్ల కేటాయింపులో నూతన విధానం ప్రకారం 21 సంవత్సరాల లోపు వయసున్న వారు, ప్రభుత్వానికి ఎక్సైజ్ రెవిన్యూ ఎగవేతదారులు లైసెన్సులు పొందటానికి అనర్హులని పేర్కొంది. పర్యాటక ప్రాంతాల్లో ఎక్కడా బార్లు, మైక్రో బ్రూవరీలు ఉండరాదని స్పష్టం చేసింది. కుష్టు వ్యాధి, ఇతర వ్యాధులున్న వారికి లైసెన్సులు మంజూరు చేయరని నూతన విధానంలో పేర్కొంది. బార్ను కనీసం 200 చదరపు మీటర్లలో ఏర్పాటు చేయాలని , వాటికి అనుబంధంగా ఏర్పాటయ్యే రెస్టారెంట్, కిచెన్ 15 చదరపు మీటర్లలో ఉండాలని నిర్ణయించింది.
బార్ల సంఖ్య 40 శాతం తగ్గింపు
ఇక అంతే కాకుండా దేవాలయాలు, మసీదులు , చర్చిలు, ఆసుపత్రులు నిర్వహించే దగ్గర వంద మీటర్ల లోపు బార్లను ఏర్పాటు చేయరాదని పేర్కొంది. మొత్తం స్టార్ హోటళ్లు బ్రూవరీ లను మినహాయించి మిగిలిన 797 బార్లలో 40 శాతం తగ్గించి 478 బార్ల కే లైసెన్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. జాతీయ, రాష్ట్ర రహదార్లకు 500 మీటర్ల లోపు దూరంలో బార్లు ఉండకూడదు అని పేర్కొంది . ప్రస్తుతం ఉన్న బార్లలో 40 శాతం తగ్గించి వాటి సంఖ్యను, ఎక్కడ ఎన్ని బార్లను తగ్గిస్తున్నారు అనే అంశాలు ఎక్సైజ్ కమిషనర్ ప్రకటిస్తారని తెలిపింది.
దరఖాస్తు ఫీజును 10 లక్షల రూపాయలు.. నాన్ రీఫండబుల్
ఇక అదే విధంగా దరఖాస్తు ఫీజును 10 లక్షల రూపాయలుగా నిర్ణయించింది. ఇది నాన్ రిఫండబుల్. అలాగే బార్ కు దరఖాస్తు చేసుకునేవారు ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ యాక్ట్ 2006 ప్రకారం లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. ఇక బార్ల నిర్వహణ సమయాలను సైతం ప్రకటించిన సర్కార్ ఉదయం 11 గంటల నుండి రాత్రి పది గంటల వరకు మాత్రమే బార్లను నిర్వహించవలసిందిగా పేర్కొంది. ఇక ఆహార సరఫరా 11 గంటల వరకు చేయవచ్చని తెలిపింది.
బార్ల విషయంలోనూ మద్య నియంత్రణే సర్కార్ టార్గెట్
మొత్తానికి బార్ల నిర్వహణలోనూ నూతన విధానాన్ని తీసుకువచ్చి కఠినంగా నియమ నిబంధనలు రూపొందించి ఏపీలో జనవరి 1 నుండి నూతన పాలసీ అమలు చేయనున్నారు. మొన్నటికి మొన్న రాష్ట్రంలో వైన్స్ సంఖ్య తగ్గించడంతోపాటు, సర్కారీ మద్యం షాపులు నిర్వహించడం, కఠినతరమైన నియమ నిబంధనలు అమలు చేయడం చేసి మద్య నియంత్రణ ను దశలవారీగా తీసుకొస్తున్న ఏపీ ప్రభుత్వం ఇప్పుడు బార్ల పైన కూడా కఠినమైన చట్టాలతో ఉక్కుపాదం మోపాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే 40శాతం బార్లను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం తో పాటుగా బార్ల నిర్వహణకు సంబంధించి చాలా కఠినంగా వ్యవహరించాలని భావిస్తుంది.