వ్యాక్సిన్తో స్ధానిక ఎన్నికలకు సంబంధం లేదు- హైకోర్టులో నిమ్మగడ్డ కౌంటర్
ఏపీలో డిసెంబర్ 25న కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానున్నందున స్ధానిక సంస్ధల ఎన్నికలు వాయిదా వేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ సర్కారుకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి షాకిచ్చారు. అసలు ఎన్నికలకూ వ్యాక్సినేషన్కూ సంబంధమేంటని పేర్కొంటూ హైకోర్టులో ఆయన కౌంటర్ దాఖలు చేశారు.
ఏపీలో కరోనా పరిస్ధితులు తగ్గుముఖం పట్టడంతో స్ధానిక ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ఇప్పటికే ఎన్నికల సంఘం ప్రకటించింది. కానీ నిమ్మగడ్డ రమేష్ ఆధ్వర్యంలో ఎెన్నికలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేని రాష్ట్ర ప్రభుత్వం.. ఎన్నికలను అడ్డుకోవాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది. డిసెంబర్ 25న కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం దేశవ్యాప్తంగా మొదలవుతోందని, ఆ సమయంలో ఎన్నికలు నిర్వహిస్తే సిబ్బంది కేటాయింపుతో పాటు ఇతర సమస్యలు తప్పవని హైకోర్టుకు తెలిపింది.
ఇవాళ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్ధానిక సంస్ధల ఎన్నికలను కరోనా వ్యాక్సినేషన్కు లింక్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వాదనకు కౌంటర్ అఫిడవిట్ను దాఖలు చేశారు. ఇందులో వ్యాక్సినేషన్కూ ఎన్నికలకు సంబంధం లేదన్నారు. కరోనా వ్యాక్సిన్ రావడానే మూడు నుంచి ఆరునెలలు పడుతుందని, ఇప్పటికిప్పుడు వ్యాక్సిన్ వచ్చే అవకాశం లేదని అఫిడవిట్లో తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సిన్ పంపిణీ చేస్తారని, అందరికీ ఒకేసారి వ్యాక్సిన్ ఇవ్వరని, అటువంటప్పుడు ఎన్నికలకు ఈ కార్యక్రమం ఎలా అడ్డు అవుతుందని అఫిడవిట్లో ఎస్ఈసీ ప్రశ్నించారు. ఇప్పటికే బీహార్, హైదరాబాద్లో ఎన్నికలు జరిగాయని, ఏపీలో కూడా అందరినీ సంప్రదించాకే ఎన్నికలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ కొట్టేయాలని నిమ్మగడ్డ కోరారు.